మాజీ సర్పంచ్‌పై టీడీపీ కార్యకర్తల దాడి 

16 Sep, 2021 07:27 IST|Sakshi
తీవ్రగాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఎర్రప్ప  

వలంటీర్లనూ అకారణంగా కొట్టిన వైనం

మాజీ మంత్రి కాలవ తిరిగి వెళ్లిన కాసేపటికే ఘటన 

రాయదుర్గం రూరల్‌(అనంతపురం జిల్లా): రాయదుర్గం మండలం చదం గొల్లలదొడ్డి గ్రామంలో బుధవారం సాయంత్రం వైఎస్సార్‌సీపీకి చెందిన మాజీ సర్పంచ్‌ ఎర్రప్పతో పాటు గ్రామ వలంటీర్లు  హరేష, శివానందలపై టీడీపీ కార్యకర్తలు అకారణంగా దాడి చేశారు. టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు గ్రామానికి వచ్చి వెళ్లిన కాసేపటికే ఈ దాడి జరగడం గమనార్హం. బుధవారం గ్రామంలో మారెమ్మ ఉత్సవాలు నిర్వహించారు. ఈ ఉత్సవాలకు టీడీపీ నాయకులు మాజీ మంత్రి కాలవను ఆహ్వానించారు. గ్రామానికి వచ్చిన ఆయన దాదాపు రెండు గంటల పాటు గడిపి..మధ్యాహ్నం రెండు గంటల సమయంలో వెనుదిరిగారు. ఆయన వచ్చిన సందర్భంగా టీడీపీ కార్యకర్తలు  టపాసులు పేల్చి నానా హంగామా చేశారు. (చదవండిదారుణ ఘటన.. ఒకే మర్రికి వెయ్యిమంది ఉరితీత...!

అంతటితో ఆగకుండా సాయంత్రం నాలుగున్నర గంటల ప్రాంతంలో తన వ్యవసాయ తోటలోకి ద్విచక్ర వాహనంపై వెళుతున్న మాజీ సర్పంచ్‌ ఎర్రప్పను అడ్డగించి..కట్టెలు, ఇనుపరాడ్లతో మూకుమ్మడిగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు.  అటుగా వచ్చిన గ్రామ వలంటీర్లు  హరేష, శివానందలపైనా అకారణంగా దాడి చేశారు. మద్యం మత్తులో ఉన్న టీడీపీ సర్పంచ్‌ మల్లేష్‌ బంధువులు గొల్ల ఈరన్న, సూర్య, మరికొందరు ఈ దాడిలో పాలుపంచుకున్నారు. రక్తపు గాయాలతో అపస్మారక స్థితిలో ఉన్న ఎర్రప్పను కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం రాయదుర్గం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.  విషయం తెలుసుకున్న పోలీసులు గ్రామానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. దాడి ఘటనపై కేసు నమోదు చేశారు. 

గొడవలకు కాలవ ఆజ్యం! 
రాయదుర్గం నియోజకవర్గంలోని గ్రామాల్లో గొడవలకు మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు ఆజ్యం పోస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇన్నాళ్లూ ప్రశాంతంగా ఉంటూ వచ్చిన గ్రామాలలో నేడు రాజకీయ స్వార్థం కోసం గొడవలు సృష్టిస్తున్నారని  స్థానికులు మండిపడుతున్నారు. కాలవ అండ చూసుకునే చదం గొల్లలదొడ్డి గ్రామంలో సర్పంచ్‌ మల్లేష్‌ మనుషులు రెచ్చిపోయారు.

చదవండి: కీచకుడి వికృత చేష్టలు.. బాలికలను మిద్దె మీదకు తీసుకెళ్లి..

మరిన్ని వార్తలు