వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ అభ్యర్థిపై టీడీపీ శ్రేణుల దాడి

7 Apr, 2021 04:36 IST|Sakshi
టీడీపీ వర్గీయుల దాడిలో గాయపడిన నూరుల్లా

చిత్తూరు జిల్లాలో ఘటన 

శాంతిపురం(చిత్తూరు జిల్లా): పరిషత్‌ ఎన్నికలను కోర్టు వాయిదా వేయడంతో శాంతిపురంలో సంబరాలు చేసుకున్న తెలుగు తమ్ముళ్లు ఓ ఎంపీటీసీ అభ్యర్థి, వాహన డ్రైవర్లపై దాడికి పాల్పడ్డారు. మంగళవారం సాయంత్రం కేజీఎఫ్‌ సర్కిల్‌ వద్దకు వైఎస్సార్‌సీపీ ప్రచార వాహనం రావడంతో టీడీపీకి చెందిన గోపాల్, ఉయ్యాల జయరామిరెడ్డి, రమేష్, వెంకటాచటం, ఆంజనేయరెడ్డిలు అడ్డుకున్నారు. సౌండ్‌ సిస్టంను, జనరేటర్‌ను బలవంతంగా ఆపేసి చెంగుబళ్ల ఎంపీటీసీ అభ్యర్థి రమేష్, వాహన డ్రైవర్‌ మణిలపై దాడి చేశారు.

ప్రచార వాహనంలోని జాక్‌ రాడ్‌ తీసుకుని వారిని తరిమికొట్టారు. దీంతో రమేష్‌ చేతికి గాయమైంది. దీనిపై బాధితులురాళ్లబూదుగూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉండగా జయరామిరెడ్డి కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. టీడీపీ వర్గీయుల దాడి విషయం తెలుసుకున్న వైఎస్సార్‌సీపీ శ్రేణులు క్షణాల్లో పెద్ద సంఖ్యలో మండల కేంద్రానికి చేరుకోవడంతో ఉద్రిక్తత ఏర్పడింది. ఇరు వర్గాల మోహరింపుతో పలమనేరు జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలు ఆగిపోయాయి. పోలీసులు అక్కడకు చేరుకుని ఇరువర్గాలనూ పంపించి వేశారు.  

వైఎస్సార్‌సీపీ నేతపై రాడ్డుతో దాడి  
ఇదిలా ఉండగా మఠం పంచాయతీలోని కేపీ మిట్టలో టీడీపీ వర్గీయుల దాడిలో వైఎస్సార్‌సీపీ బూత్‌ కన్వీనర్‌ నూరుల్లా తీవ్రంగా గాయపడ్డాడు. బాధితుడి కథనం మేరకు.. మంగళవారం రాత్రి గ్రామంలో రెండు కుటుంబాల మధ్య భూ వివాదం సాగుతోంది. గొడవను పరిష్కరించేందుకు నూరుల్లా వెళ్లాడు. అయితే నూరుల్లాపై కక్షతో ఉన్న టీడీపీ కార్యకర్తలు యారబ్, సాధిక్‌లు నూరుల్లాతో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో నూరుల్లాను సాధిక్‌ గట్టిగా పట్టుకోగా..  టాటాసుమో టూల్‌ కిట్‌లో ఉండే రాడ్డుతో నూరుల్లా తలపై యూరబ్‌ కొట్టాడు. తీవ్ర గాయాల పాలైన నూరుల్లాను కుప్పం ప్రాంతీయ వైద్యశాలకు తరలించారు. దీనిపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు.   

>
మరిన్ని వార్తలు