టీడీపీ కార్యకర్తల బరితెగింపు 

11 Feb, 2021 08:29 IST|Sakshi
పట్టుబడిన కర్ణాటక మద్యం, టీడీపీ కార్యకర్తలతో సెబ్‌ సీఐ మొహిద్దీన్‌బాషా

అక్రమ మద్యాన్ని తరలిస్తూ సెబ్‌ పోలీసులపై దాడికి యత్నం 

కంబదూరు(అనంతపురం జిల్లా): గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలుపు కోసం టీడీపీ నాయకులు బరితెగించారు. తమ అక్రమాలకు అడ్డుతగిలిన సెబ్‌ పోలీసులపై ఎదురుదాడికి యత్నించారు. వివరాలు ఇలా... కంబదూరు మండలం ములకనూరు గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్తలు తిరుమలేష్, బాబు, తిమ్మరాజు, తిమ్మరాయుడు గ్రామంలో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు మద్యం పంపిణీకి సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా కర్ణాటక ప్రాంతం నుంచి మంగళవారం రాత్రి మద్యాన్ని తీసుకుని రెండు ద్విచక్ర వాహనాలపై స్వగ్రామానికి బయలుదేరారు. మార్గమధ్యంలో కుందుర్పి మండలం తెనగల్లు గ్రామ శివారులో వాహన తనిఖీకి సెబ్‌ పోలీసులు ప్రయత్నించగా.. దాడికి ప్రయత్నించారు. వారి దాడిని కంబదూరు సెబ్‌ సీఐ మొహిద్దీన్‌బాషా, సిబ్బంది సమర్థవంతంగా ఎదుర్కొని, నిందితులను అదుపులోకి తీసుకుని, 182 టెట్రా ప్యాకెట్ల కర్ణాటక మద్యంతో పాటు ద్విచక్ర వాహనాలను సీజ్‌ చేశారు. నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఈ సందర్భంగా సీఐ తెలిపారు.

 

మరిన్ని వార్తలు