స్కిల్‌ డెవలప్‌మెంట్‌  స్కాంలో కీలక మలుపు.. చంద్రబాబు అవినీతికోట బద్దలు!

6 Mar, 2023 20:06 IST|Sakshi

సాక్షి, అమరావతి: చంద్రబాబు హయాంలో జరిగిన ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం కేసు కీలక మలుపు తిరిగింది. పెద్దస్థాయి అరెస్టులకు దారితీస్తోంది. అప్పట్లో స్కిల్‌డెవలప్‌మెంట్ అధికారిగా పనిచేసిన అర్జా శ్రీకాంత్‌ను విచారించేందుకు నోటీసులు జారీ చేసే దిశగా సీఐడీ ముందుకుసాగుతోంది. ఈ కేసుకు సంబంధించి మరింత మందిని అరెస్టు చేసేందుకు సన్నద్ధమవుతోంది.

గతంలో చంద్రబాబు హయాంలో నైపుణ్యాభివృద్ధిపేరిట రూ.3,300 ప్రాజెక్టు ప్రారంభమైంది. సీమెన్స్‌ అంతర్జాతీయ సంస్థతో కలిసి శిక్షణ ఇచ్చేలా డిజిటల్ టెక్ ఒప్పందం కుదుర్చుకుంది. 10 శాతం వాటాగా జీఎస్టీతో కలిపి చంద్రబాబు ప్రభుత్వం రూ.370 కోట్లు చెల్లించింది.  మిగిలిన 90 శాతం సీమెన్స్‌ సంస్థ చెల్లిస్తుందని ఒప్పందంలో ఉంది. చివరకు తమకు సంబంధం లేదని సీమెన్స్‌ అంతర్జాతీయ సంస్థ ప్రకటించింది.

అందులో పనిచేస్తున్న ఒక మనిషిని తీసుకువచ్చి రూటింగ్‌ చేసినట్లు కేసు దర్యాప్తులో వెల్లడైంది.  చంద్రబాబు ప్రభుత్వం కట్టిన డబ్బును వేర్వేరు షెల్‌ కంపెనీలకు మళ్లించారు. ఎలైట్‌ కంప్యూటర్స్‌, స్కిల్లర్‌ ఇండియా ప్రైవేటు లిమిటెడ్‌, నాలెడ్జ్‌ పోడియం, ఈటీఏ- గ్రీన్స్‌, కేడన్స్‌ పార్టనర్‌ తదితర కంపెనీలకు ఈ డబ్బు మళ్లించారు. రూ. 370 కోట్లలో రూ.240 కోట్లు రూటింగ్‌ చేశారు. సీమెన్స్‌లో ఎండీగా ఉన్న సుమన్‌ బోస్‌, డిజైన్‌ టెక్‌ ఎండీ వికాస్‌ కన్వికర్‌ల ద్వారా కుంభకోణం నడిపారు.

ఈ ప్రాజెక్టు ఎంఓయూ రూ.3,300 కోట్లు కాగా..  జీవో దగ్గరకు వచ్చేసరికి రూ.3,300 కోట్ల ప్రస్తావనను చంద్రబాబు ప్రభుత్వం తొలగించింది. చివరకు రూ.240 కోట్ల రూపాయలను షెల్‌ కంపెనీల ద్వారా లాగేశారు.

2016-18 మధ్యే ఈ మొత్తం స్కాం జరిగింది. ఈ కుంభకోణంపై విజిల్‌ బ్లోయర్‌ గతంలోనే ఏసీబీకి ఫిర్యాదు చేసింది. దీంతో చంద్రబాబు ప్రభుత్వం  వెంటనే అసలు ఫైళ్లను మాయంచేసింది.  అధికారులను మేనేజ్‌ చేసే సమయంలో.. కేంద్రం ప్రభుత్వ జీఎస్టీ అధికారుల దర్యాప్తులో ఈ స్కాం బయటపడింది. దీంతో ఈ స్కాంపై కేంద్ర ఆదాయపుపన్ను శాఖ దృష్టిపెట్టింది.

గ్లోబల్‌ సంస్థ సీమెన్స్‌ ఇంటర్నేషనల్‌ టీం కూడా తమ కంపెనీ పేరుమీద మోసాలకు పాల్పడ్డారని తేల్చింది. ఈ వ్యవహారంలో తమకు ఎలాంటి సంబంధం లేదని, తమ పేరుమీద మోసం జరిగిందని సీమెన్స్‌ నేరుగా వచ్చి వివరణ ఇచ్చింది. దీంతో సీమెన్స్‌ పేరిట ఈ మోసాలకు పాల్పడ్డారని సీఐడీ తేల్చింది. దీనికి సహకరించిన ఆనాటి అధికారులు కూడా కోర్టుకు ముందుకు వచ్చి స్టేట్‌మెంట్లు ఇచ్చారు. దీంతో సీఐడీ పెద్దస్థాయిలో అరెస్టులకు సిద్ధమైంది.

మరిన్ని వార్తలు