టీడీపీ నేత దాష్టీకం.. దళిత దంపతులపై దాడి

15 Aug, 2021 11:05 IST|Sakshi

పెదకూరపాడు: ప్రశ్నించిన దళితులపై టీడీపీ నేతలు, సానుభూతి పరుల దాడులు నిరాటంకంగా కొనసాగుతూనే ఉన్నాయి. పొలం వద్ద జరిగిన చిన్న వాగ్వాదం విషయమై మాట్లాడదాం రండి అని దళిత దంపతులను పిలిచి, కర్రలతో దాడి చేసి కులం పేరుతో దూషించి, పోలీసుస్టేషన్‌కు వెళ్లకుండా అడ్డుకున్న ఘటన గుంటూరు జిల్లా పెదకూరపాడు మండలం హుస్సేన్‌నగరం గ్రామంలో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. బాధితులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మండలంలోని హుస్సేన్‌నగరం గ్రామ ఎస్సీ కాలనీకి చెందిన సాతులూరి లక్ష్మయ్య, దేవకరుణ దంపతులు కౌలుకు పొలం సాగు చేస్తున్నారు. ఈ నెల 12వ తేదీన ఆ పొలంలో  అదే గ్రామానికి చెందిన టీడీపీ నేత నెల్లూరు బుల్లెబ్బాయి గోర్రు తోలారు. 13వ తేదీ సాయంత్రం లక్ష్మయ్య, దేవకరుణ పొలం చూసేందుకు వెళ్లగా.. గోర్రు సక్రమంగా తోలకపోవడంతో బుల్లెబ్బాయిని ప్రశి్నంచారు. దీంతో వారి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.

ఈ విషయమై మాట్లాడదాం రండి అని దంపతులను గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్, టీడీపీ నాయకుడు నెల్లూరు మల్లికార్జునరావు తన ఇంటికి అదే రోజు సాయంత్రం పిలిపించారు. దంపతులు జరిగిన విషయం చెబుతుండగానే.. పొలంలో గొర్రు తోలిన నెల్లూరు బుల్లెబ్బాయి లక్ష్మయ్యను మాపై ఫిర్యాదు చేస్తావురా అంటూ కాలితో తన్నగా.. బుల్లెబ్బాయి కుటుంబసభ్యులు నెల్లూరి బోస్‌బాబు, శివయ్య, రోశయ్య, పవన్, అరుణ, రమాదేవి, రమాదేవి కోడలు, బుల్లెబ్బాయి భార్య కర్రలతో దాడి చేశారు. కులం పేరుతో దూషించారు. బాధితులు పోలీసుస్టేషన్‌కు వెళ్లేందుకు ప్రయత్నించగా మార్గంమధ్యలోనే అడ్డుకున్నారు. దీంతో దళిత దంపతులు అర్ధరాత్రి సమయంలో  అమరావతి మండలం అత్తలూరు మీదగా 75తాళ్ళూరు వచి్చ, అక్కడ నుంచి పెదకూరపాడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పెదకూరపాడు సీహెచ్‌సీలో ప్రథమ చికిత్స చేయించుకుని.. అమరావతి సీహెచ్‌సీలో చికిత్స పొందుతున్నారు. తొమ్మిది మందిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ గుంజి తిరుమలరావు తెలిపారు.  

మరిన్ని వార్తలు