ఎఫ్‌పీఓ సీసీపై టీడీపీ నేత దాడి 

10 Sep, 2020 10:25 IST|Sakshi
దేవేంద్రరెడ్డి (ఫైల్‌)

ముదిగుబ్బ(అనంతపురం జిల్లా): రైతు ఉత్పత్తి సంఘాలలో తీసుకున్న రుణాలపై రికవరీకి వెళ్లిన ఎఫ్‌పీఓ సీసీ శివయ్యపై టీడీపీ నాయకుడు దాడి చేశాడు. బాధితుడు తెలిపిన మేరకు... రైతు ఉత్పత్తి సంఘాలలో షిర్డీసాయి రైతు ఉత్పత్తి సంఘం ద్వారా నాగారెడ్డిపల్లికి చెందిన పది మంది రైతులు 2019లో రూ.1.05 లక్షల రుణం తీసుకున్నారు. ఈ రుణం రికవరీ కోసం సీసీ శివయ్య బుధవారం నాగారెడ్డిపల్లికి వెళ్లారు. ఆరు నెలలుగా రుణం కంతు చెల్లించని విషయాన్ని రైతు సంఘం అధ్యక్షుడు నీలకంఠారెడ్డి వద్ద చర్చిస్తుండగా సంఘం సభ్యుడైన టీడీపీ మండల మాజీ కన్వీనర్, మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూరి ముఖ్య అనుచరుడు దేవేంద్రరెడ్డి కలగజేసుకుని గొడవకు దిగాడు.

అప్పు కట్టేది లేదని, ఎవరితోనైనా చెప్పుకోపో అంటూ సీసీపై దాడి చేశాడు. అంతటితే ఆగకుండా ఇక్కడే విద్యుత్‌ స్తంభానికి కట్టేస్తే ఎవడు వచ్చి విడిపించుకుపోతాడో చూస్తామంటూ బెదిరించాడు. అతడి వద్దనున్న సెల్‌ఫోన్‌ను లాక్కుని పంపించాడు. అనంతరం బాధిత ఎఫ్‌పీఓ సీసీ శివయ్య పట్నం పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. ఎస్‌ఐ నగేష్‌ బాబు కేసు నమోదు చేసి నిందితుడు దేవేంద్రరెడ్డిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు పంపించారు.

>
మరిన్ని వార్తలు