చిట్టీల పేరుతో టీడీపీ నాయకుడి మోసం

8 Apr, 2022 23:03 IST|Sakshi

రూ.15 కోట్ల మేర ఎగవేత 

ఇటీవల ఎస్పీకి ఫిర్యాదు 

పొదలకూరు: చిట్టీల పేరుతో ఓ టీడీపీ నాయకుడు వందలాది మంది బాధితులకు రూ.కోట్లు కుచ్చుటోపీ పెట్టాడు. ఎస్పీ విజయారావు గత సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమంలో పొదలకూరుకు చెందిన రత్నం అనే బాధితుడు అరుణాచలంపై రాతపూర్వకంగా ఫిర్యాదు చేశాడు. బాధితుల కథనం మేరకు.. పొదలకూరు మజరా గ్రామం చిట్టేపల్లి గ్రామానికి చెందిన అరుణాచలం టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో ఆ పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించాడు.

అతడు పెస్టిసైడ్స్‌ అండ్‌ ఫర్టిలైజర్స్‌ వ్యాపారిగా ఈ ప్రాంతంలో అందిరికీ సుపరిచితుడు. చాలాకాలంగా నమ్మకంగా బంధువులు, స్నేహితులు, మండలంలోని ప్రముఖుల వద్ద సుమారు రూ.15 కోట్ల వరకు చిట్టీలు కట్టించాడు. ఆరునెలలుగా పాటలు సక్రమంగా పెట్టకపోగా పాడిన వారికి సకాలంలో డబ్బులు చెల్లించలేదు. అప్పటి నుంచి బాధితులు ఆ వ్యక్తి చుట్టూ తిరుగుతున్నా ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకున్నాడు. నెలరోజులుగా బాధితు ల నుంచి ఒత్తిడి పెరగడంతో పరారైయినట్లుగా చెబుతున్నారు. విలాసవంతంగా జీవిస్తున్న ఇతడు గతేడాది ఓ సినిమా నిర్మించేందుకు సైతం బాధితుల నగదును వినియో గించినట్లుగా ప్రచారం జరుగుతోంది. 

సీఐ విచారణ
కాగా రత్నం ఫిర్యాదును  ఎస్పీ పొదలకూరు సీఐ సంగమేశ్వరరావుకు పంపారు. రూ.6 లక్షల చిట్‌ వేశాడని ఆయనకు రూ.5 లక్షలు అరుణాచలం చెల్లించాలని ఫిర్యాదులో పేర్కొన్నట్లుగా సీఐ గురువారం వెల్లడించారు.

మరిన్ని వార్తలు