కీచక టీడీపీ నేత రాళ్లపల్లి ఇంతియాజ్ అరెస్టు

7 Oct, 2022 13:02 IST|Sakshi

సాక్షి, శ్రీసత్యసాయి జిల్లా: కీచక టీడీపీ నేత రాళ్లపల్లి ఇంతియాజ్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. నిందితుడిని మీడియా ఎదుట ప్రవేశపెట్టారు. ఇంతియాజ్ లైంగిక వేధింపులు తాళలేక ఇంటర్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఇంతియాజ్‌పై 306, 506 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
చదవండి: జేసీ ట్రావెల్స్‌ ఫోర్జరీ కేసులో కీలక పురోగతి

ప్రేమించకపోతే నీ ఫొటోలు మార్ఫింగ్‌ చేసి ఫేస్‌బుక్‌లో పెడతానని బెదిరించడంతో భయపడిపోయిన ఓ ఇంటర్‌ విద్యార్థిని ఉరి వేసుకుంది. టీడీపీ నాయకుడి బెదిరింపుల కారణంగానే ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ బలవన్మరణానికి ముందు సెల్ఫీ వీడియోలో చెప్పింది.

శ్రీసత్యసాయి జిల్లా తనకల్లు మండలం ఎర్రబల్లిలో బుధవారం జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఎర్రబల్లికి చెందిన కురుబ శ్రీనివాసులు, రాధమ్మ దంపతుల ఏకైక కుమార్తె సంధ్యారాణి(17). అన్నమయ్య జిల్లా మొలకలచెరువులోని మెడల్‌ కళాశాలలో ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. అయితే టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ కందికుంట వెంకటప్రసాద్‌ అనుచరుడైన నల్లచెరువుకు చెందిన తెలుగు యువత మండల ప్రధాన కార్యదర్శి రాళ్లపల్లి ఇంతియాజ్‌.. ఫేస్‌బుక్‌లో సంధ్యారాణితో పరిచయం పెంచుకున్నాడు.

ఆ తర్వాత ప్రేమించాలంటూ వేధించడం మొదలెట్టాడు. ఆమె ఒప్పుకోకపోవడంతో ఎర్రబల్లికి వెళ్లి వారి తల్లిదండ్రుల సమక్షంలోనే తనని ప్రేమించాలంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. ఇటీవల సంధ్యారాణి తల్లిదండ్రులతో కలిసి పాలపాటిదిన్నె ఆంజనేయస్వామి గుడి వద్దకు వెళ్లగా.. అక్కడికీ వచ్చి మరీ వేధించాడు. తనను ప్రేమించకుంటే ఫొటోలు మార్ఫింగ్‌ చేసి ఫేస్‌బుక్‌లో పెడతానంటూ బెదిరించాడు. దీంతో సంధ్యారాణి తీవ్ర భయాందోళలనకు లోనైంది. ఈ క్రమంలోనే దసరా సెలవులకు ఇంటికొచ్చిన సంధ్యారాణి బుధవారం తెల్లవారుజామున ఇంట్లో ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకుంది.

మరిన్ని వార్తలు