టీడీపీ నేతల అత్యుత్సాహం

12 Nov, 2021 04:33 IST|Sakshi
ఒంగోలు రూరల్‌ సీఐ రాంబాబు చేతిలో నుంచి లాఠీని లాక్కుంటున్న టీడీపీ నేతలు

రైతుల పాదయాత్రలో రసాభాస 

హైకోర్టు ఆదేశాలు బేఖాతరు  

ఎన్నికల కోడ్‌ ఉల్లంఘన 

పోలీసులపై దాడికి యత్నం 

స్వల్పంగా లాఠీచార్జి

నాగులుప్పలపాడు: అమరావతి రైతుల పాదయాత్రలో తెలుగుదేశం పార్టీ నేతలు అరాచకాలకు పాల్పడుతున్నారు. రైతుల పేరుతో యథేచ్ఛగా ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించడంతోపాటు హైకోర్టు ఆదేశాలను తుంగలోతొక్కి పాదయాత్రను రసాభాస చేస్తున్నారు. 157 మందితో మాత్రమే పాదయాత్ర కొనసాగించాలన్న కోర్టు ఆదేశాలు పాటించకపోగా పాదయాత్రకు రక్షణ కల్పిస్తున్న పోలీసులపై దాడికి పాల్పడుతున్నారు. ప్రకాశం జిల్లాలో నాలుగోరోజు గురువారం నాగులుప్పలపాడులో ప్రారంభమైన ఈ పాదయాత్రలో రైతుల ముసుగులో టీడీపీ నేతలు అరాచకాలకు పాల్పడ్డారు.

మండలంలోని చదలవాడ గ్రామ ఎంపీటీసీ స్థానానికి ఈ నెల 16వ తేదీ ఎన్నిక జరగనున్నందున మండల వ్యాప్తంగా ఎన్నికల కోడ్‌ అమలులో ఉందని పోలీసులు, అధికారులు పాదయాత్ర బృందానికి నోటీసులు ఇచ్చారు. అయినా.. పాదయాత్ర బృందం చదలవాడ సమీపంలోకి వెళ్లేసరికి తెనాలి మాజీ ఎమ్మెల్యే ఆలపాటి రాజాతో పాటు అమ్మనబ్రోలు, చీర్వానుప్పలపాడు గ్రామాల టీడీపీ నేతలు, అనుచరులు పోలీసుల ఆంక్షలను పట్టించుకోకుండా పాదయాత్ర బృందంలోకి దూసుకెళ్లడానికి ప్రయత్నించారు. ఎన్నికల కోడ్‌ ఉందని ఎంత చెప్పినా వారు ఆగకపోవడంతో పోలీసులు రోప్‌తో ఆపే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో టీడీపీ నేతలు పోలీసులపై దాడికి దిగారు. ఒంగోలు రూరల్‌ సీఐ రాంబాబు చేతిలో ఉన్న లాఠీని లాక్కునేందుకు ప్రయత్నించారు. టీడీపీ నాయకుల దాడిని అదుపుచేసే క్రమంలో 
పోలీసులు స్వల్పంగా లాఠీచార్జి చే«శారు.  

మరిన్ని వార్తలు