అమానుష ఘటన: విద్యార్థికి డ్రిల్లింగ్ మిషన్‌తో పనిష్మెంట్‌ ఇచ్చిన టీచర్‌

27 Nov, 2022 14:56 IST|Sakshi

ఇటీవల కాలంతో ఉపాధ్యాయులు చిన్న చిన్న విషయాలకే కాస్త ఫ్రస్టేషన్‌కి గురయ్యి విద్యార్థులకు అత్యంత అమానుషమైన పనిష్మెంట్లు ఇస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. మొన్నటికి మొన్న ఒక ఉపాధ్యాయుడు కొడవలితో పాఠశాల్లో హల్‌చల్‌ చేస్తూ... అందర్నీ భయబ్రాంతులకు గురిచేశాడు. అంతకు ముందు మరొక ప్రబుద్ధుడు స్ప్రుహ తప్పి పడిపోయాలా ఒక విద్యార్థిని కర్రతో దాడి చేసి చంపేశాడు. ఇలాంటి ఉదంతాలను మర్చిపోక మునుపే ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో మరో ఘటన చోటు చేసుకుంది. 

వివరాల్లోకెళ్తే...ఒక విద్యార్థి రెండో ఎక్కం అప్పచెప్ప లేకపోవడంతో డ్రిల్లింగ్‌ మిషన్‌తో పనిష్మెంట్‌ ఇచ్చాడు. ఈ ఘటనలో సదరు విద్యార్థికి ఎడమ చేతికి తీవ్ర గాయాలయ్యాయి. బాధిత విద్యార్థి సిసామౌ నివాసి. అతను కాన్పూర్‌ జిల్లాలోని ప్రేమ్‌నగర్‌లోని ప్రాథమికోన్నత పాఠశాలలో 5వ తరగతి చదువుతున్నాడు. ఐతే సదరు విద్యార్థి రెండో ఎక్కం అప్పచెప్ప లేకపోవడంతో ఆ పాఠశాల ఉపాధ్యాయుడు ఈ పనిష్మెంట్‌ ఇచ్చారు.

ఆ తర్వాత విద్యార్థిని  ఇంటికి పంపించడంతో ఫ్రాథమిక చికిత్స తీసుకున్నట్లు తెలుస్తోంది. ఉపాధ్యాయుడి నిర్వాకానికి ఆగ్రహం చెందిన బాధితుడు బంధువులు పాఠశాలకు చేరుకుని గొడవ చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. దీంతో సమాచారం అందుకున్న ప్రాథమిక శిక్ష అధికారి, బ్లాక్‌ ఎడ్యుకేషన్‌ అధికారి సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.

ఈ ఘటనపై కాన్పూర్‌కి చెందిన ప్రాథమిక శిక్షా అధికారి సుజిత్‌ కుమార్‌ మాట్లాడుతూ...ఈ మొత్తం ఘటనపై విచారణకు ఒక కమిటీని ఏర్పాటు చేశామని, ప్రేమ్ నగర్, శాస్త్రి నగర్‌లోని బ్లాక్ ఎడ్యుకేషన్ అధికారులు దీనిపై విచారణ జరిపి నివేదిక పంపుతారు. ఈ ఘటనలో ఎవరైనా దోషులుగా తేలితే వారు శిక్షార్హమైన చర్యల ఎదుర్కోవలసి ఉంటుందని చెప్పారు. 

(చదవండి: క్షణికావేశంలో కన్న బిడ్డనే కడతేర్చాడు.. )

మరిన్ని వార్తలు