Hyderabad: సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ అనుమానాస్పద మృతి 

17 Aug, 2022 18:25 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అనుమానాస్పదంగా సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ మృతి చెందిన సంఘటన నార్సింగి పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని అలకాపూర్‌ టౌన్‌షిప్‌ శివబాలాజీ అపార్ట్‌మెంట్‌లో మంగళవారం వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కృష్ణా జిల్లా, గన్నవరం ప్రాంతానికి చెందిన భార్గవ్‌రెడ్డి(31) పుప్పాలగూడ, అలకాపూర్‌ టౌన్‌షిప్‌లో ఉంటూ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిగా పని చేస్తున్నాడు. అతని గ్రామానికే చెందిన సాయిసందీప్, జస్వంత్‌ అతనితో పాటే అదే ఫ్లాట్‌లో ఉంటున్నారు.

10 రోజుల క్రితం సందీప్, జస్వంత్‌  స్వ గ్రామానికి వెళ్లారు. మంగళవారం తిరిగి వచ్చిన సాయిసందీప్‌ డోర్‌ కొట్టినా, ఫోన్‌ చేసినా భార్గవ్‌ రెడ్డి స్పందించకపోవడంతో అనుమానం వచ్చి వాచ్‌మెన్‌ను పిలిచాడు. అతను కిచెన్‌ చిమ్నీ ద్వారా లోపలికి వెళ్లి చూడగా భార్గవ్‌రెడ్డి నేలపై మృతి చెంది పడి ఉన్నాడు. అతను ఆఫీసు నుంచి చివరి ఫోన్‌కాల్‌ అందుకున్నట్లు ఉందని, ఎలా చనిపోయాడనే విషయం తెలియరాలేదని పేర్కొన్నారు. సాయి సందీప్‌ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా భార్గవ్‌రెడ్డి ఐదు రోజుల క్రితమే మృతి చెంది ఉండవచ్చనని భావిస్తున్నారు.   

చదవండి: (హాస్టళ్లపై పోలీసుల ఫోకస్‌.. ఈ పది నిబంధనలు పాటించాల్సిందే)

మరిన్ని వార్తలు