ఆనందంగా విహారయాత్రకు బయల్దేరారు..అంతలోనే ఘోర ప్రమాదం

20 Nov, 2022 10:41 IST|Sakshi
ప్రమాదంలో ధ్వంసమైన కారు

కెలమంగలం: వారాంతం కావడంతో అందరూ కలిసి పర్యాటక ప్రాంతంలో సరదాగా గడపాలని బయల్దేరారు. కానీ విధి వక్రించడంతో యాక్సిడెంట్‌కు గురయ్యారు. బెంగళూరులోని ఐటీ కంపెనీలో పనిచేస్తున్న మిత్రులు కారులో క్రిష్ణగిరి జిల్లాలోని హొగెనకల్‌ విహారానికి వెళ్తుండగా అంచెట్టి సమీపంలో కారు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒక యువతి, మరో యువకుడు అక్కడికక్కడే మరణించారు.  

ఏడు మంది స్కార్పియోలో..  
వివరాల మేరకు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన చిరాజ్‌ సురేష్‌ (24), ప్రవీణ (24), సయ్యద్‌ అమీ ర్‌సల్మాన్‌ (24), మణికంటేశ్వర (33), జార్ఖండ్‌కు చెందిన అమ్మన్‌ కుమార్‌ (24), బీహార్‌కు చెందిన రిషికుమార్‌ (24), అభయ్‌కుమార్‌ (24)లు బెంగళూరులో నివాసముంటూ ఐటీ కంపెనీల్లో పనిచేస్తున్నారు. శనివారం ఉదయం 7 మందీ కలిసి హొగేనకల్‌ను చూడాలని ఆంధ్ర రిజి్రస్టేషన్‌ (ఏపీ 39 బీకే 1289) స్కారి్పయో కారులో బయలుదేరారు.  

అతివేగంతో పల్టీ  
డెంకణీకోట –హొగెనకల్‌ రోడ్‌ అంచెట్టి సమీపంలోని శేషురాజపురం వద్ద అతివేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో చిరాజ్‌ సురేష్, ప్రవీణలు ఘటనా స్థలంలోనే మృతి చెందారు. అంచెట్టి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని తీవ్రంగా గాయాలపాలైన నలుగురిని చికిత్స కోసం అంచెట్టి పీహెచ్‌సీకి, అక్కడి నుంచి డెంకణీకోట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని విచారణ జరుపుతున్నారు. తీవ్రంగా గాయపడినవారు స్పృహలో లేకపోవడంతో ఏ జిల్లావాసులన్నదీ తెలియాల్సి ఉంది. 

(చదవండి: కిరాతక భర్త.. భార్య పిల్లలపై పెట్రోల్‌ పోసి..)

మరిన్ని వార్తలు