తల్లిపై కూతురు కర్కశత్వం.. పెనంతో కొట్టి చంపిన 14 ఏళ్ల బాలిక

23 Feb, 2022 13:06 IST|Sakshi

లక్నో:  నవమాసాలు మోసి.. కనిపెంచిన తల్లిపైనే ఓ కూతురు అత్యంత కిరాతకంగా ప్రవర్తించింది. తల్లి మందలించిందన్న కోపంతో 14 ఏళ్ల బాలిక ఆమెను బలంగా కొట్టి చంపింది. ఈ దారుణ ఘటన ఉత్తర ప్రదేశ్‌లోని నొయిడాలో చోటుచేసుకుంది. నోయిడాలోని శాహదరా ప్రాంతానికి చెందిన అనురాధ అనే మహిళకు 16 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. అయిదేళ్ల తర్వాత భర్తతో విడాకులు తీసుకొని కూతురు(14)తో కలిసి నొయిడాలోని సెక్టార్​-77 అంతరిక్ష కెన్వాల్​ సొసైటీలో నివసిస్తోంది. గ్రేటర్ నోయిడాలోని ఒక సంస్థలో సరఫరా విభాగంలో పని చేస్తోంది. ఈ క్రమంలో ఆదివారం తల్లీకూతుళ్ల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.

ఇంట్లో గిన్నెలు శుభ్రం చేయాలని తల్లి కూతురిని కోరింది. కూతురు పనులు చేయకపోవడంతో ఆమెను తిడుతూ చేయిచేసుకుంది. దీంతో ఆగ్రహానికి లోనైన బాలిక పెనంతో(ఫ్రైయింగ్‌ పాన్‌) తల్లిని కొట్టింది. తలకు బలమైన గాయాలవ్వడంతో అనురాధ అనురాధ స్పృహ కోల్పోయింది. అయితే తల్లికి గాయాలవ్వడంతో బాలిక తన చుట్టుపక్కల వారిని పిలిచింది. పొరుగున ఉన్న వారు హుటాహుటిన ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లినప్పటికీ అప్పటికే మహిళ చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు.

సమాచారం అందుకున్న పోలీసులు.. సంఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. స్థానికులను అడిగి తెలుసుకున్నారు. కూతురు కొట్టడం ద్వారా అనురాధ చనిపోయినట్లు ఆమె తమ్ముడు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మృతదేహానికి పోస్ట్​మార్టం నిర్వహించారు. బాలికను కస్టడీలోకి తీసుకుని బాలనేరస్థుల కేంద్రానికి తరలించామని పోలీసులు తెలిపారు.
చదవండి: ప్రేమ పెళ్లి.. కడుపులో పెరుగుతున్న బిడ్డ తనది కాదని అనడంతో..

మరిన్ని వార్తలు