ఆటోలో వచ్చి బాలికను కిడ్నాప్ చేసిన కిరాతకులు.. గదిలో బంధించి 3 నెలలపాటు సామూహిక అత్యాచారం

26 Jul, 2022 16:26 IST|Sakshi

రాంచీ: జార్ఖండ్ బోకారోలో అత్యంత పాశవిక ఘటన వెలుగు చూసింది. 9వ తరగతి చదువుతున్న బాలికను కిడ్నాప్‌ చేసిన ముగ్గురు కిరాతకులు మూడు నెలలపాటు ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. జులై 19న బాధితురాలు ఎలాగోలా నిందితుల చెర నుంచి తప్పించుకుని ఇంటికి చేరుకుంది. జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు వివరించింది.

అప్పటికే తమ బిడ్డ కన్పించట్లేదని కేసు పెట్టిన తల్లిదండ్రులు విషయం తెలిసిన వెంటనే బాధితురాల్ని పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ముగ్గురు నిందితులను మనోజ్ కుమార్‌, విష్ణు కుమార్, మంతోష్ కుమార్‌లుగా గుర్తించారు.

మార్కెట్ నుంచి ఇంటికి వస్తుండగా..
ఏప్రిల్ 20న బాలిక మార్కెట్‌ నుంచి తిరిగివస్తుండగా.. ఆటోలో వచ్చిన మంతోష్ కుమార్ మరో ఇద్దరి సాయంతో ఆమెను కిడ్నాప్ చేశాడు. ఆ తర్వాత బాలికను  ఓ గదిలో బంధించి రోజు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాలికను గదిలోనే ఉంచి తాళం వేసి వెళ్లిపోయేవారు. జులై 19న అటువైపుగా వెళ్తున్న ఓ మహిళ బాధితురాలి పరిస్థితిని చూసి రాయితో  తాళం పగలగొట్టి విముక్తి కల్పించింది. వెంటనే బాలిక ఇంటికి వెళ్లి విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. అయితే ప్రస్తుతం ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నారు. వారి కోసం ముమ్మరంగా గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
చదవండి: కన్నతండ్రే కాలయముడై... కూతురిని, అల్లుడిని చంపి...

మరిన్ని వార్తలు