పెళ్లి ఇష్టం లేదని యువతి బలవన్మరణం

23 Jan, 2022 08:05 IST|Sakshi

సాక్షి,శాలిగౌరారం: పెళ్లి ఇష్టం లేక ఓ యువతి బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన మండలంలోని ఆకారం గ్రామంలో శనివారం చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన తాటిపల్లి లింగయ్య–ముత్తమ్మ దంపతులకు ఐదుగురు కుమార్తెలు. లింగయ్య ఏడు సంవత్సరాల క్రితం రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. తల్లి ముత్తమ్మ పిల్లలను పెంచిపెద్దచేయడంతో పాటు నలుగురు కుమార్తెలకు వివాహాలు చేసింది. చిన్నకుమార్తె ప్రియాంక(19) నల్లగొండలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ప్రథమ సంవత్సరం చదువుతోంది.

ఈ క్రమంలో చిన్నకుమార్తె వివాహం కూడా జరిపించేందుకు అంతా సిద్ధం చేసుకుంది. ప్రస్తుతం కళాశాలలకు సెలవులు ఉండటంతో ఇంటివద్ద ఉన్న ప్రియాంక శనివారం వ్యవసాయ పొలం వద్ద వడ్లు ఎండబోసేందుకు వెళ్లింది. వడ్లు ఎండబోసిన అనంతరం పక్కనే ఉన్న పత్తిచేనులోని వేపచెట్టుకు చున్నీతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కొంత సమయం తర్వాతా కందిపంట కోసేందుకని అటుగా వెళ్తున్న వారు గమనించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో బాధిత కుటింబికులు ఘటన స్థలానికి చేరుకుని రోదించారు. కాగా, ఈ ఘటనపై రాత్రి వరకు ఫిర్యాదు అందలేదని ఎస్‌ఐ హరిబాబు తెలిపారు.  

మరిన్ని వార్తలు