విద్యార్థులతో ఆడిపాడిన చిన్నారి.. ఉన్నట్టుండి కుప్పకూలడంతో...

26 Oct, 2022 09:25 IST|Sakshi
బాలుడు కౌశిక్‌(ఫైల్‌)

సాక్షి, రాజన్న సిరిసిల్ల: దీపావళి పండుగను సంబరంగా జరుపుకొని మరునాడు పాఠశాలకు వెళ్లిన ఓ చిన్నారి గుండె అకస్మాత్తుగా ఆగింది. అప్పటిదాకా తోటి విద్యార్థులతో ఆడిపాడిన బాలుడు ఉన్నట్టుండి కుప్పకూలి కన్నుమూశాడు. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా వెంకట్రావుపల్లిలో మంగళవారం చోటుచేసుకుంది. వెంకట్రావుపల్లికి చెందిన బుర్ర కుషిత– సతీశ్‌ దంపతులకు కొడుకు కౌశిక్‌(9), కుమార్తె మేఘన ఉన్నారు. కౌశిక్‌ స్థానిక ప్రభుత్వ పాఠశాలలో మూడోతరగతి చదువుతున్నాడు. పాఠశాలలో మధ్యాహ్న భోజన సమయంలో క్యూలైన్‌లో నిలుచుని ఉన్న కౌశిక్‌ హఠాత్తుగా కిందపడిపోయాడు.

గమనించిన ఉపాధ్యాయులు తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. ఉపాధ్యాయుడి వాహనంలోనే కరీంనగర్‌లోని ఓ ప్రయివేటు ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి కౌశిక్‌ అప్పటికే గుండెపోటుతో మరణించాడని తెలిపారు. బాలుడు కొంతకాలంగా ఫిట్స్, గుండె సంబంధిత(హార్ట్‌ వీక్‌) వ్యాధితో బాధపడుతున్నట్లు గ్రామస్తులు తెలిపారు. కౌశిక్‌ మృతితో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు.  

చదవండి: డీఏవీ స్కూల్‌ మరో డొల్లతనం.. 5వ తరగతి వరకే గుర్తింపు 

మరిన్ని వార్తలు