ఫోన్‌లో మాట్లాడుతుందని అనుమానం పెంచుకున్నాడు..

19 Aug, 2021 10:58 IST|Sakshi

 సాక్షి,పటాన్‌చెరు టౌన్‌: ఇతరులతో ఫోన్‌లో మాట్లాడుతుందని అనుమానం పెంచుకున్న భర్త..భార్యను సుత్తితో తలపై కొట్టి హత్య చేసిన సంఘటన పటాన్‌చెరు పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ వేణుగోపాల్‌రెడ్డి, క్రైం సీఐ శ్రీనివాసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని చిట్కుల్‌ వడ్డెర కాలనీకి చెందిన రాజేశ్వరి(23)కి మూడు సంవత్సరాల క్రితం మెదక్‌ జిల్లా కౌడిపల్లి మండల పరిధిలోని వెంకటరావుపేట గ్రామానికి చెందిన మేక వేలుతో వివాహం జరిగింది. పెళ్లి తర్వాత చిట్కుల్‌లోని వడ్డెరకాలనీలోనే కాపురం పెట్టారు.రెండున్నరేళ్ల కుమారుడు రాజేష్‌ ఉన్నాడు.

మేక వేలు రాయి కొట్టే పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో భార్య ఇతరులతో ఎక్కువగా ఫోన్లు మాట్లాడుతుందని అనుమానం పెంచుకున్నాడు. ఇదే విషయమై తరచు ఇద్దరి మధ్య గొడవలు జరిగేవి. ఈ 16వ తేదీన కూడా ఇద్దరు గొడవ పడగా, కుటుంబసభ్యులు సర్దిచెప్పారు.  మనసులో కక్ష పెట్టుకున్న మేక వేలు బుధవారం ఉదయం రాళ్లు కొట్టేందుకు ఉపయోగించే సుత్తితో భార్య రాజేశ్వరి తలపై గట్టి కొట్టాడు. దీంతో ఆమె గట్టిగా అరుపులు వేయగా, మేక వేలు ఇంటి నుంచి పరారయ్యాడు. చుట్టుపక్కల వారు, కుటుంబసభ్యులు గమనించి పటాన్‌చెరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆమె మృతి చెందిందని డాక్టర్లు చెప్పారు. మృతదేహానికి పోస్టుమార్టమ్‌ చేసి కుటుంబ సభ్యులకు అప్పగించారు. కాగా, భార్యను హత్య చేసిన మేక వేలు పటాన్‌చెరు పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు