వివాహేతర సంబంధం: భర్త నిద్రపోతుంటే.. రాత్రి ప్రియుడితో కలిసి కారులో..

31 May, 2022 16:35 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి,హుస్నాబాద్‌(సంగారెడ్డి): కరీంనగర్‌ జిల్లా గన్నేరువరం మండలం గుండ్లపల్లికి చెందిన వెంకట్‌రెడ్డి(45) అనే వ్యక్తిని అతడి భార్య పెనుగొండ లక్ష్మి రోకలిబండతో కొట్టి హత్య చేసిన అనంతరం హుస్నాబాద్‌ మండలం పొట్లపల్లి వాగు ఒడ్డులో పూడ్చిపెట్టిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. గన్నెరువరం సీఐ కృష్ణారెడ్డి వివరాల ప్రకారం..వెంకట్‌రెడ్డి, లక్ష్మి దంపతులకు ఇద్దరు కుమారులు. వెంకట్‌రెడ్డి శుభకార్యాలకు వంటలు చేస్తుంటాడు. అతడి భార్య లక్ష్మి ఇంటివద్ద కిరాణం, బెల్ట్‌షాపు నిర్వహిస్తోంది. పొట్లపల్లికి చెందిన బొనగిరి వెంకటస్వామితో లక్ష్మి కొంతకాలంగా వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది.

ఈ విషయంపై భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. భర్త వెంకట్‌రెడ్డి నిద్రపోతుంటే భార్య లక్ష్మి శుక్రవారం రాత్రి రోకలిబండతో కొట్టి హత్యచేసింది. రాత్రి వేళ ప్రియుడు వెంకటస్వామితో కలిసి కారులో మృతదేహాన్ని సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌ మండలం పొట్లపల్లి వాగు ఒడ్డుకు తీసుకెళ్లి పూడ్చివేయించింది. వెంకటస్వామి, కారు డ్రైవర్‌ కుమార్‌ భయపడి గన్నేరువరం పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి జరిగిన విషయాన్ని వివరించి నేరాన్ని అంగీకరించి లొంగిపోయారు. కుమార్‌ ఇచ్చిన సమాచారం మేరకు నిందితురాలు లక్ష్మి, ఆమె ప్రియుడు వెంకటస్వామిని పోలీసులు అదుపులోకి తీసుకొని సోమవారం ఘటన స్థలానికి వెళ్లారు. తహసీల్దార్‌ మహేశ్‌ సమక్షంలో పంచనామా నిర్వహించి మృతదేహాన్ని వెలికితీసి అక్కడే పోస్ట్‌మార్టం నిర్వహించారు. పూర్తి వివరాలు దర్యాప్తు చేసిన అనంతరం వెల్లడిస్తామని సీఐ కృష్ణారెడ్డి తెలిపారు.

చదవండి: పెళ్లి జరిగి రెండు నెలలు కూడా కాలేదు.. ఇంతలో సడన్‌గా..

మరిన్ని వార్తలు