రాత్రి పూట పనికి వెళ్లొద్దని చెప్పింది.. మాట వినకపోవడంతో..

5 Aug, 2021 09:23 IST|Sakshi

సాక్షి,తాండూరు( వికారాబాద్‌): భర్త తన మాట వినలేదని మనస్తాపానికి గురైన ఓ వివాహిత ఉరేసుకొని తనువు చాలించింది. ఈ సంఘటన మండల పరిధిలోని ఐనెల్లిలో మంగళవారం రాత్రి జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కర్ణాటకలోని చిత్తాపూర్‌ తాలుకా నల్సార్‌ గ్రామానికి చెందిన వడ్డె సిద్దు, రేణుక(26) దంపతులు కొన్నేళ్ల క్రితం బతుకు దెరువు కోసం ఐనెల్లి గ్రామానికి వలస వచ్చారు. వీరికి పిల్లలు అంజలి, లక్ష్మణ్‌ ఉన్నారు. భార్యాభర్తలు కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.

మంగళవారం రాత్రి అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి  ఇంట్లో ఎలక్ట్రిషన్‌ పనులు చేయడానికి తాను వెళ్తున్నట్లు సిద్దు భార్య రేణుకకు చెప్పాడు. అయితే రాత్రి సమయంలో పనికి వెళ్లొద్దని భార్య సిద్దును వారించింది. అయినా వినకుండా సిద్దు త్వరగా ఇంటికి వచ్చేస్తానని చెప్పి వెళ్లిపోయాడు. అర్ధరాత్రి సుమారు ఒంటి గంట సమయంలో ఇంటికి తిరిగి వచ్చిన సిద్దుకి ఇంట్లో దూలానికి వేలాడుతూ రేణుక నిర్జీవంగా కనిపించింది. జరిగిన విషయాన్ని గ్రామస్తులకు చెప్పి పోలీసులకు సమాచారమిచ్చాడు. రేణుక మాట  వినకుండా సిద్దు పనికి వెళ్లడంతోనే మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడిందని మృతురాలి తండ్రి వెంకటప్ప పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈమేరకు కేసు దర్యాప్తులో ఉంది.

మరిన్ని వార్తలు