కాపురంలో ఫోన్‌కాల్‌ చిచ్చు: వయసైన కూతుళ్లతో తల్లి అదృశ్యం

23 Jul, 2021 16:36 IST|Sakshi

బహదూర్‌పురా (హైదరాబాద్‌): ముగ్గురు పిల్లలతో కలిసి బయటికి వెళ్లిన ఓ మహిళ అదృశ్యమైన సంఘటన హైదరాబాద్‌లోని కామాటిపురా పోలీస్‌స్టేషన్‌ పరిధిలో గురువారం చోటు చేసుకుంది. ఇన్‌స్పెక్టర్‌ రాంబాబు తెలిపిన వివరాల ప్రకారం... కామాటిపురా మురళీ గుమ్మాస్‌ ప్రాంతానికి చెందిన కిషన్‌ శర్మ, పూజ ఆలియాస్‌ రాగిణి (34) దంపతులు. వీరికి 16 ఏళ్ల క్రితం వివాహం కాగా.. ముగ్గురు ఆడ పిల్లలు ఉన్నారు. మూడేళ్ల కిందట మలక్‌పేట్‌లో నివసించే సమయంలో ఇంటికి ఎదురుగా ఉన్న పవన్‌ (30)తో పూజ తరచుగా మాట్లాడేది. ఈ విషయమై భర్త కిషన్‌ శర్మ పవన్‌ను మందలించి, 8 నెలల కిందట కామాటిపురాలోని మురళీ గుమ్మాస్‌కు మకాం మార్చారు.

అయితే పవన్‌ కూడా ఇటీవల తన నివాసాన్ని మురళీ గుమ్మాస్‌కు మార్చాడు. తరచు ఫోన్‌లో మాట్లాడుతుండడంతో పూజతో కిషన్‌ శర్మ గొడవ పడగా.. ఈ నెల 16వ తేదీన పూజ తన ముగ్గురు కూతుళ్లు కీర్తి, మోహిని ఆలియాస్‌ మీనా (14), గోపి (12)తో తిరుపతి వెళ్తున్నానని చెప్పి వెళ్లింది. ఇప్పటవరకు తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందిన కిషన్‌ శర్మ కామాటిపురా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆచూకీ తెలిసిన వారు సెల్‌ నం. 9490616495లో సంప్రదించాలన్నారు.

మరిన్ని వార్తలు