ఆస్తి ఇవ్వలేదని టెన్త్‌ విద్యార్థి ఆత్మహత్య

26 Mar, 2021 07:12 IST|Sakshi

దాయాదుల తీరుతో తీవ్ర మనస్తాపం

హస్నాబాద్‌లో ఘటన

కొడంగల్‌ రూరల్‌: వారసత్వంగా తన తండ్రికి చెందాల్సిన ఆస్తిని..ఇవ్వడం లేదన్న మనస్తాపంతో టెన్త్‌ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన వికారాబాద్‌ జిల్లా కొడంగల్‌ మండల పరిధిలోని హస్నాబాద్‌లో గురువారం చోటుచేసుకుంది. వివరాలు.. కొడంగల్‌ పట్టణానికి చెందిన కాంసన్‌పల్లి వెంకటయ్య కుమారుడు నిఖిల్‌ (16) చిన్నప్పటి నుంచి తన అమ్మమ్మ ఊరైన హస్నాబాద్‌లో నివాసం ఉంటూ అక్కడే పదో తరగతి చదువుతున్నాడు. తల్లిదండ్రులు కాంసన్‌పల్లి వెంకటయ్య, అంజమ్మ జీవనోపాధి నిమిత్తం హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నారు.

వెంకటయ్య తల్లిదండ్రులకు సంబంధించిన భూమి విషయంలో వెంకటయ్య, అతని అన్నదమ్ములు గొడవ పడ్డారు. ఈ విషయంపై ఇటీవల పలుమార్లు గొడవలు జరిగాయి. ఈ సమయంలో నిఖిల్‌ తన పెదనాన్నలతో మాట్లాడి వారసత్వంగా తమకు చెందాల్సిన భూమిని తమ తండ్రి పేరున పట్టా చేయాలని అడగ్గా.. సరేనని చెప్పిన వారు కాలయాపన చేస్తుండటంతో మనస్తాపానికి గురయ్యాడు.

ఈ క్రమంలో బుధవారం రాత్రి హస్నాబాద్‌లోని ఆరుబయటే నిద్రించిన నిఖిల్‌ రాత్రికి రాత్రి ఇంటి ఎదురుగా ఉన్న చెట్టుకు చీరతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తెల్లవారు జామున వృద్ధురాలు లేచి చూడగా..నిఖిల్‌ చెట్టుకు వేలాడుతూ కన్పించడంతో స్థానికుల సాయంతో కిందకు దించారు. అయితే అప్పటికే నిఖిల్‌ మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని శవ పంచనామా నిర్వహించారు. మృతుడి అమ్మమ్మ బెస్త చెన్నమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ మహిపాల్‌రెడ్డి తెలిపారు. 
చదవండి: ఎకరా పొలం ఉన్నా బతికేటోళ్లం!

మరిన్ని వార్తలు