ఆరుగురి దుర్మరణం
పలువురికి గాయాలు
ఆగి ఉన్న సిమెంటు లారీని ఢీకొన్న మినీ లారీ
శ్రీశైలం వెళ్లి వస్తుండగా దుర్ఘటన
రెంటచింతల: భక్తిశ్రద్ధలతో దైవదర్శనం చేసుకుని ఇంటికి తిరిగివస్తున్న వారిని ఘోర రోడ్డు ప్రమాదం చంపేసింది. కొన్ని నిమిషాల్లో ఇంటికి చేరతారనగా జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. ఆగి ఉన్న సిమెంటు లారీని మినీలారీ ఢీకొనడటంతో జరిగిన ఈ ప్రమాదంలో పలువురు గాయపడ్డారు. పల్నాడు జిల్లా రెంటచింతల సమీపంలో ఆదివారం రాత్రి ఈ ప్రమాదం జరిగింది.
రెంటచింతలలోని వడ్డెరబావి కాలనీకి చెందిన 38 మంది వ్యవసాయ కూలీల ముఠా, వారి బంధువులు మినీలారీలో శ్రీశైలం పుణ్యక్షేత్రానికి వెళ్లారు. స్వామిని దర్శించుకుని తిరిగి బయలుదేరిన వారు ఆదివారం రాత్రి 11.50 గంటల సమయంలో రెంటచింతల సబ్స్టేషన్ సమీపానికి చేరుకున్నారు. అదే సమయంలో మాచర్ల నుంచి సిమెంట్లోడ్తో వస్తున్న లారీ డ్రైవర్, క్లీనర్ స్నానం చేసేందుకు సబ్స్టేషన్ సమీపంలోని ఎర్రకాలువ (దశబంధు) వద్ద ఆపారు.
అదే సమయంలో భక్తులతో వచ్చిన మినీలారీ ఆగి ఉన్న సిమెంటు లారీని వెనుకనుంచి వేగంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. వారి మృతదేహాలు రోడ్డుపై చెల్లాచెదురుగా పడ్డాయి. పలువురు గాయపడ్డారు. ప్రమాదాన్ని గమనించిన సబ్స్టేషన్లో ఉన్న వారు వచ్చి లారీలో ఇరుక్కున్న వారిని బయటకుతీసి స్థానిక ప్రైవేటు ఆస్పత్రికి, గురజాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
మృతిచెందినవారిలో నారాయణపురం రోశమ్మ (70), మక్కెన రమణ (50), అన్నవరపు కోటమ్మ (70), కురిసేటి రమాదేవి (50), పెద్దారపు లక్ష్మీనారాయణ (32), పులిపాడు కోటేశ్వరమ్మ (60) ఉన్నారు. ప్రమాదస్థలాన్ని గురజాల డీఎస్పీ బెజవాడ మెహర్జయరాంప్రసాద్, ఎస్ఐ షేక్ షమీర్బాషా పరిశీలించారు. మృతదేహాలను గురజాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.