సినీ నటి ఇంట్లో బంగారం దోచేసిన నర్సు

5 Sep, 2020 07:23 IST|Sakshi

చెన్నై : సినీ నటి ఇంట్లో 111 గ్రాముల బంగారం చోరీకి గురైంది. ఆమె ఇంట్లో పనిచేస్తున్న నర్సు చేతివాటం చూపడంతో ఆమెను పోలీసులు అరెస్ట్‌ చేశారు. వివరాల్లోకి వెళితే... స్థానిక రాయపేటలోని లయిడ్స్‌ రోడ్డు వీధిలో నటి  గాయత్రి సాయినాథ్‌ తన తల్లితో కలిసి నివశిస్తోంది. వృద్ధురాలైన తన తల్లికి సపర్యలు చేయడానికి స్థానిక మైలాపూర్, కబాలితోటకు చెందిన శివకామి అనే నర్సును ఏర్పాటు చేసుకుంది. కాగా ఇటీవల నటి గాయత్రి సాయినాథ్‌ ఇంట్లో 111 గ్రాముల బంగారం చోరీకి గురైంది. దీంతో ఆమె రాయపేట పోలీసులకు ఫిర్యాదు చేసింది. ( కూతురుతో సహా సినీ నటి అదృశ్యం )

ఈ కేసును ఇన్‌స్పెక్టర్‌ చార్లెస్‌ నేతృత్వంలో సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ రవిచంద్రన్, పోలీసులు శక్తివేల్, మారి, తిలగవతి ప్రత్యేక బృందంగా ఏర్పడి, దర్యాప్తు చేపట్టారు. ఆ ప్రాంతంలోని సీసీ కెమెరాలు పరిశీలించగా  దొంగతనానికి గురైన బంగారాన్ని నటి గాయత్రి సాయినాథ్‌ ఇంట్లో పని చేస్తున్న నర్సు శివకామి దొంగిలించినట్లు తెలియవచ్చింది. దీంతో ఆమెను పోలీసులు అరెస్ట్‌ చేశారు. విచారణలో బంగారాన్ని  శివకామి తాకట్టు పెట్టినట్టు తెలిసింది. దీంతో పోలీసులు ఆ బంగారాన్ని స్వాధీనం చేసుకొని, గాయత్రి సాయినాథ్‌కు అందజేసినట్లు తెలిపారు.

మరిన్ని వార్తలు