ఆ రెండు గంటలే వాళ్ల టార్గెట్.. తలుపు తీసి ఉందో.. ఇక అంతే..!

19 Oct, 2022 16:29 IST|Sakshi

ముంబై: ముంబైలో వరుస చోరీలకు పాల్పడుతూ స్థానికులను హడలెత్తిస్తోంది ఓ దొంగల ముఠా. దాదర్, బైకులా ప్రాంతంలో సెక్యూరిటీ గార్డులు లేని అపార్ట్‌మెంట్స్‌, ఇళ్లే లక్ష్యంగా దొంగతనాలు చేస్తోంది. ముఖ్యంగా ఉదయం 6 నుంచి 8 గంటల మధ్య పాలు పోసేవాళ్లు, న్యూస్‌పేపర్లు వేసేవాళ్లు వస్తారని తలుపులు తీసి ఉంచే ఇళ్లనే టార్గెట్‌ చేసుకుని దోపిడీలు చేస్తోంది. క్షణాల్లో ఇంట్లోకి ప్రవేశించి మొబైల్ పోన్లు, వస్తువులు, నగలు, ఇలా ఏది కన్పిస్తే దాన్ని తీసుకెళ్లిపోతుంది. 

ఒక్క అక్టోబర్‌లోనే ఈ ముఠా 12 చోరీలకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. 30 ఏళ్ల పైబడిన ఓ మహిళ, 18 ఏళ్ల యువతి, 10 ఏళ్ల బాలుడు, 10-12ఏళ్ల బాలిక కలిసి దొంగతనాలు చేస్తున్నట్లు తెలిపారు. సీసీటీవీ ఫుటేజీలో లభించిన వీరి ఫోటోను షేర్ చేసి స్థానికులను అప్రమత్తం చేశారు.

అయితే సోమవారం రాత్రి దాదర్ రైల్వే స్టేషన్‌లో ఈ ముఠా లీడర్‌గా ఉన్న మహిళను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. మిగతా ముగ్గురి కోసం గాలిస్తున్నట్లు వెల్లడించారు. ఉదయం వేళ ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, తలుపులు బార్ల తీసి ఉంచొద్దని సూచించారు.
చదవండి: 6 అడుగుల ఎత్తు.. 30 లక్షల ఉద్యోగం ఉన్నోడే కావాలి..!

మరిన్ని వార్తలు