వందేమాతరం అంటూ భవనం పై నుంచి దూకేసిన దొంగ.. షాక్‌లో పోలీసులు

9 Jul, 2022 19:42 IST|Sakshi

ఇటీవలకాలంలో దొంగలు చాలా విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు. విచిత్రమైన వాటిని దొంగలించి ప్రజలను, పోలీసులను షాక్‌కి గురి చేస్తున్నారు. సినిమాలోని డాన్‌లు మాదిరి దొంగతనం చేసి తప్పించుకోవడం వంటివి చేస్తున్నారు. అచ్చం అలానే ఇక్కడొక వ్యక్తి దొంగతనానికి వచ్చాడు. ఐతే సమయానికి పోలీసులు వచ్చేయడంతో...ఆ వ్యక్తి అరెస్టు అవుతానన్న భయంతో  ఏం చేశాడో వింటే కచ్చితంగా షాక్‌ అవుతారు. 

అసలేం జరిగిందంటే....ముంబైలో కొలాబా ప్రాంతంలోని చర్చ్‌గేట్‌ సమీపంలోని ఒక భవనంలోకి 25 ఏళ్ల వ్యక్తి ప్రవేశించాడు. ఆ భవనం వాచ్‌మెన్‌ ఒక అపరిచిత వ్యక్తి గేటు పై నుంచి దూకి భవనంలోకి ప్రవేశించనట్లు గమనించాడు. దీంతో అతను ఎమర్జెన్సీ అలారం మోగించాడు. ఆ అలారం మోగడంతో భవనంలోని నివాసితులు అప్రమత్తమై పోలీసులకు సమాచారం అందించారు. ఇంతలో పోలీసులు కూడా సంఘటన స్థలానికి సమయానికి చేరుకున్నారు.

దీంతో సదరు వ్యక్తి అరెస్టు అవుతానన్న భయంతో ఆ భవనం పైన నాల్గో అంతస్తులోని కిటికి అంచునే నిలబడిపోయాడు. అతన్ని కిందకి వచ్చేయమని పోలీసులు, నివాసితులు చెప్పిన అతను వినలేదు. ఆఖరికి అతన్ని అరెస్టు చేయమని పోలీసులు హామీ ఇచ్చిన అతన కన్విన్స్‌ అవ్వలేదు. ఇక చేసేదేమీ లేక పోలీసులు అగ్నిమాపక సిబ్బందిని కూడా రప్పించారు. వారు అతన్ని ప్లాస్టిక్‌ వలపైకి దూకేయమని కోరారు కూడా. దాదాపు మూడు గంటలపాటు అతన్ని ఒప్పించేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు.

ఇంతలో ఒక పోలీసు సేఫ్టి బెల్ట్‌ సాయంతో దొంగ వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించాడు. అంతే సదరు దొంగ వందేమాతరం అంటూ అరుస్తూ... నాల్గో అంతస్తు నుంచి దూకేశాడు. దీంతో ఒక్కసారిగా పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, నివాసితులు షాక్‌ అయ్యారు. ఈ ఘటన అక్కడ ఉన్నవారందర్నీ కలచి వేసింది. వెంటనే పోలీసులు ఆ వ్యక్తిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.  సదరు వ్యక్తిని రోహిత్‌గా గుర్తించమని పోలీసులు చెప్పారు. ఐతే అతను చికిత్స పొందుతూ మృతి చెందడంతో అతని గురించి పూర్తి విషయాలు తెలియరాలేదని పోలీసులు వెల్లడించారు.  

(చదవండి: తోటి విద్యార్థినిపై సామూహిక అత్యాచారం.. వీడియో తీసి)

మరిన్ని వార్తలు