దొంగ బంగారు చైన్‌ ముక్క మింగేశాడు కానీ..

23 Aug, 2021 08:03 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, బెంగళూరు : ‘‘తొండి మొదలుమ్‌ ద్రిక్షక్షియుమ్‌’’ మళయాల సినిమాలో హీరో ఫాహద్‌ ఫజిల్‌( ఓ దొంగ) బస్‌లో బంగారు గొలుసు కొట్టేసి, దొరక్కుండా ఉండటానికి దాన్ని మింగేస్తాడు. అచ్చం అలాంటిదే కాకున్నా.. ఓ దొంగ చైన్‌ ముక్కను మింగేసిన ఘటన కర్ణాటకలోని బెంగళూరులో చోటుచేసుకుంది. సిటీ మార్కెట్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో శనివారం రాత్రి ఈ చైన్‌ స్నాచింగ్‌ జరిగింది. ఎంటీ స్ట్రీట్‌కు చెందిన హేమ అనే మహిళ దుకాణానికి వెళ్లి తిరిగి ఇంటికి వస్తుండగా ముగ్గురు స్నాచర్లు ఆమె మెడలో ఉన్న బంగారు గొలుసు లాక్కొడానికి యత్నించారు. ఆమె కేకలు వేస్తూ చైన్‌ను గట్టిగా పట్టుకుంది. ఈ క్రమంలో చైన్‌లోని ఓ భాగం దొంగ చేతిలో చిక్కింది. స్థానికులు అక్కడికి చేరుకుని ఓ స్నాచర్‌ను పట్టుకుని దేహశుద్ధి చేశారు.

మరో ఇద్దరు పరారయ్యారు. ఇదే సమయంలో గొలుసు ముక్కను దొంగ మింగేశాడు. పోలీసుల విచారణలో తన వద్ద గొలుసు లేదని చెప్పడంతో పోలీసులు అనుమానంతో నగరంలోని విక్టోరియా ఆస్పత్రిలో స్కానింగ్‌ చేయించారు. కడుపులో బంగారుచైన్‌ ముక్క కనిపించింది. పోలీసులు కక్కించే ప్రయత్నాల్లో ఉన్నారు.   

చదవండి : అన్నయ్య రాఖీ కట్టించుకోలేదని చెల్లి ఆత్మహత్య

మరిన్ని వార్తలు