ఉంగరాలు మింగేసిన దొంగ

1 Jun, 2021 01:11 IST|Sakshi
దొంగ శిబు, కడుపులో నుంచి తీసిన ఉంగరాలు   

ఆపరేషన్‌ ద్వారా తొలగింపు  

బనశంకరి: పోలీసులకు ఆధారాలు దొరకరాదని దొంగిలించిన బంగారు ఉంగరాలను మింగిన దొంగకు డాక్టర్లు ఆపరేషన్‌ చేసి 35 గ్రాముల బంగారు ఉంగరాలు బయటికితీశారు. ఈ సంఘటన కర్ణాటకలో దక్షిణకన్నడ జిల్లా సుళ్య పోలీస్‌స్టేషన్‌ పరిధిలో వెలుగుచూసింది. మార్చి చివర్లో సుళ్య పాతబస్టాండు వద్ద గల నగల షాపులో చోరీ జరిగింది. రూ.7.50 లక్షల విలువ చేసే 180 గ్రాముల బంగారం ఉంగరాలు, రూ.50 వేలు నగదు దోచుకెళ్లారు.

ఈ కేసులో పోలీసులు ఐదురోజుల కిందట తంగచ్చయన్‌ మ్యాథ్యూ, శిబు అనే ఇద్దరిని అరెస్ట్‌ చేశారు. ఎవరికీ తెలియకుండా శిబు తన వద్ద గల 35 గ్రాముల ఉంగరాలను మింగేశాడు. అతనికి కడుపునొప్పి రావడంతో పోలీసులు ఆదివారం ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. ఎక్స్‌రే తీయగా కడుపులో ఉంగరాలు ఉన్నట్లు తేలింది. దీంతో వైద్యులు అతని పొట్ట కోసి 25 చిన్న చిన్న ఉంగరాలను తీశారు. దొంగ ప్రస్తుతం కోలుకుంటున్నాడు.

మరిన్ని వార్తలు