సికింద్రాబాద్‌ బంగారం షాపులో భారీ చోరి

16 Jan, 2021 10:38 IST|Sakshi

సాక్షి, రాంగోపాల్‌పేట్‌: సికింద్రాబాద్‌ పాట్‌ మార్కెట్‌లోని ఓ నగల దుకాణంలో భారీ చోరీ జరిగింది. వెంటిలేటర్‌ గ్రిల్‌ను తొలగించి షాపులోకి చొరబడిన దొంగలు భారీగా ఆభరణాలు ఎత్తుకెళ్లారు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.పాట్‌ మార్కెట్‌కు చెందిన అనిల్‌ జైన్‌ అదే ప్రాంతంలో నేమిచంద్‌ జైన్‌ జ్యూవెలరీ పేరుతో బంగారం నగల దుకాణం నిర్వహిస్తున్నారు. శుక్రవారం తెల్లవారు జామున గుర్తుతెలియని వ్యక్తులు దుకాణం వెనుక వైపున ఉండే వెంటిలేటర్‌ గ్రిల్స్‌ను తొలగించి లోపలికి ప్రవేశించారు.

అనంతరం 1200 గ్రాముల బంగారం ఆభరణాలు ఎత్తుకుని వెళ్లారు. మధ్యాహ్నం తర్వాత షాపునకు వచ్చిన యజమాని అనిల్‌జైన్‌ దుకాణంలోని వస్తువులు చెల్లాచెదురై ఉండటాన్ని గుర్తించాడు. షాపులో దొంగతనం జరిగిందని గుర్తించిన ఆయన పోలీసులకు సమాచారం అందించారు. మార్కెట్‌ ఇన్‌స్పెక్టర్‌ నాగేశ్వరరావు, ఏసీపీ వినోద్‌కుమార్‌ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. క్లూస్‌ టీమ్, డాగ్‌ స్క్వాడ్‌ సిబ్బంది ఆధారాలు సేకరించారు.  

ప్రత్యేక బృందాలతో గాలింపు 
షాపులో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించగా ఒకే  వ్యక్తి లోపలికి వచ్చినట్లు రికార్డై ఉంది. రాత్రి పూట కావడంతో సీసీ పుటేజ్‌ స్పష్టంగా కనిపించడం లేదు. టాస్క్‌పోర్స్‌ పోలీసులతో పాటు, ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు పాత నేరస్తుల పనే అయి ఉంటుందని అనుమానిస్తున్నారు.  

మరిన్ని వార్తలు