Eternal Bride: నిత్య పెళ్లి కూతురు.. ఒకరికి తెలియకుండా మరొకరిని.. విడాకులు తీసుకోకుండానే..

27 May, 2022 17:53 IST|Sakshi
శిరీష (ఫైల్‌)

బేతంచెర్ల(నంద్యాల జిల్లా): ఓ మహిళ ఒకరికి తెలియకుండా మరొకర్ని ఇలా ముగ్గురిని పెళ్లి చేసుకుని మోసం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఆస్తి కోసం పెళ్లి చేసుకోవడం.. ఆ తర్వాత ఆస్తి తన పేరు మీద రాయకపోతే విడాకులంటూ భయపెట్టడం ఆమె నైజం. ఆమె ప్రవర్తనపై అనుమానం వచ్చి మూడో భర్త పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిత్య పెళ్లి కూతురు మోసాలు వెలుగులోకి వచ్చాయి.
చదవండి: పెళ్లయిన యువతికి మాజీ ప్రేమికుడి వేధింపులు.. అత్తమామలకు ఫోటోలు పంపించి..

బేతంచెర్ల ఎస్‌ఐ శ్రీనివాసులు తెలిపిన వివరాల మేరకు.. నంద్యాల మండలం మిట్నాల గ్రామానికి చెందిన వై. మేరీ జేసింత అలియాస్‌ (మేరమ్మ) కుమార్తె శిరీషకు మొదట అవుకు మండలం చెన్నంపల్లె గ్రామానికి చెందిన పాణ్యం మల్లికార్జున రెడ్డితో వివాహమైంది. ఆస్తి తన పేరు మీద రాయకపోవడంతో కాపురం చేయకుండా వచ్చేసింది. అతనితో విడాకులు తీసుకోకుండానే మండల కేంద్రం కొత్తపల్లెకు చెందిన శ్రీనివాసులు రెడ్డిని శిరీష రెండో వివాహం చేసుకుంది. ఇక్కడ కూడా ఇదే పరిస్థితి ఎదురైంది.

అతనితో విడాకులు తీసుకోకుండా బేతంచెర్ల మండలం ఆర్‌ఎస్‌ రంగాపురం గ్రామానికి శివరామిరెడ్డి కుమారుడు యు. మహేశ్వర్‌రెడ్డిని ఈ ఏడాది ఫిబ్రవరి 5వ తేదీన వివాహం చేసుకుంది. వివాహం కంటే ముందుగా తన కుమార్తె పేరు మీద రూ. 5 లక్షల డిపాజిట్‌ చేయాలనే తల్లి మేరీ జేసింత సూచన మేరకు శిరీష పేరు మీద ఫిబ్రవరి 1న డిపాజిట్‌ చేశారు. కానీ పెళ్లి అయిన రెండు నెలలకే తన కుమార్తె పేరు మీద ఆస్తి రాసి ఇవ్వాలని, లేకపోతే సంసారానికి పంపనని తల్లి నిబంధన పెట్టడమే కాకుండా ఇబ్బందులకు గురిచేసింది. అనుమానం వచ్చిన మహేశ్వర్‌ రెడ్డి.. శిరీష గురించి విచారించగా అప్పటికే రెండు పెళ్లిళ్లు చేసుకుందని తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ పీ. శ్రీనివాసులు తెలిపారు. కాగా ముగ్గురిని మోసం చేసిన శిరీష ప్రస్తుతం నాల్గో పెళ్లి చేసుకోవడానికి సిద్ధమైనట్లు సమాచారం.

మరిన్ని వార్తలు