‘వేడుకున్నా కనికరించలేదు’.. అందుకే ఆ ఎస్‌ఐని చంపేశాం..

23 Nov, 2021 06:25 IST|Sakshi
ఎస్‌ఐ భూమినాథన్‌

ఎస్‌ఐ హత్యలో మైనర్లు

సాక్షి, చెన్నై: మేకలను దొంగలించిన తమను వదలిపెట్టాలని ఎంత వేడుకున్నా కనికరించకపోవడంతోనే ఎస్‌ఐను హతమార్చినట్టు నిందితులు పోలీసులకు వాంగ్ములం ఇచ్చారు. హంతకుల్లో ఇద్దరు మైనర్లు కావడంతో రహస్య ప్రదేశంలో ఉంచి విచారిస్తున్నారు. తిరుచ్చి జిల్లా నవల్‌పట్టి పోలీస్‌స్టేషన్‌ స్పెషల్‌ ఎస్‌ఐ భూమినాథన్‌ను మేకల దొంగలు హత్య చేసిన ఘటన ఆదివారం సంచలనం సృష్టించింది. ఈ కేసును తీవ్రంగా పరిగణించిన తిరుచ్చి పోలీసు యంత్రాంగం ప్రత్యేక బృందాలతో దర్యాప్తును వేగవంతం చేసింది. సెల్‌ సిగ్నల్స్‌ ఆధారంగా నవల్‌ పట్టికి చెందిన మణిగండన్‌(19)ని అదుపులోకి తీసుకున్నారు.  

చదవండి: (మేకల దొంగల వీరంగం.. స్పెషల్‌ ఎస్సై హత్య.. రూ.కోటి ఎక్స్‌గ్రేషియా)

ఆదివారం రాత్రి అతడిని అరెస్టు చేసే క్రమంలో గ్రామస్తులు అడ్డుతగిలారు. తుపాకీ నీడలో అతడిని అరెస్టు చేశారు. అతనిచ్చిన సమాచారం మేరకు ఇద్దరు మైనర్లు( 14, 16) చిక్కారు. మరో నిందితుడి కోసం గాలిస్తున్నారు. మేకలను దొంగలించి తప్పించుకు వెళ్తున్న తమను ఎస్‌ఐ పట్టుకున్నారని, వదలిపెట్టాలని ఎంతగా వేడుకున్నా వినలేదని.. ఎవరికో ఫోన్‌ చేసి త్వరగా రావాలని చెప్పడంతో తన వద్దనున్న కత్తితో దాడి చేశానని నిందితుడు మణిగండన్‌ పోలీసులకు వాంగ్ములం ఇచ్చాడు. మరణించినాంతరం అక్కడి నుంచి పారిపోయామని తెలిపాడు. ఈ ముగ్గురిని రహస్య ప్రదేశంలో ఉంచి విచారిస్తున్నారు. నాలుగో వ్యక్తి కోసం వివరాలు సేకరిస్తున్నారు. 

మరిన్ని వార్తలు