విగ్రహం ధ్వంసం కేసు: ముగ్గురు అరెస్ట్‌

23 Nov, 2020 16:09 IST|Sakshi

సాక్షి, అవనిగడ్డ (కృష్ణా జిల్లా): దివంగత నేత మాజీ మంత్రి మండలి వెంకట కృష్ణారావు విగ్రహం ధ్వంసం కేసులో ముగ్గురు నిందితులను అవనిగడ్డ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అవనిగడ్డకు చెందిన భూపతి అన్వేష్, భూపతి రేణుకయ్య, భూపతి అజయ్‌లు ఈ చర్యకు పాల్పడినట్లు డీఎస్పీ మహబూబ్ బాషా తెలిపారు. నిందితులు మోదుమూడి బస్‌షెల్టర్‌ వద్ద ఉన్నారన్న పక్కా సమాచారంతో అక్కడకు చేరుకుని నిందితులను అదుపులోకి తీసుకొని విచారించామని ఆయన తెలిపారు. (చదవండి: రాత్రి చితక్కొట్టి: పొద్దున అల్లుడ్ని చేసుకున్నారు)

ఈ నెల 14న మద్యం మత్తులో విగ్రహం ధ్వంసం చేసి  కాల్వలో పడి వేసినట్లు విచారణలో తేలిందని చెప్పారు. కేసు దర్యాప్తులో భాగంగా అవనిగడ్డ మహబూబ్ బాషా ఆదేశాల మేరకు.. అవనిగడ్డ సీఐ రవికుమార్ ఆధ్వర్యంలో రెండు బృందాలుగా ఏర్పడి నిందితులను అవనిగడ్డ ఎస్‌ఐ సందీప్, నాగాయలంక ఎస్‌ఐ శ్రీనివాస్ అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులను డీఎస్పీ అభినందించారు. ఎవరైనా దేవాలయాలు, రాజకీయ నాయకుల విగ్రహాలపై అసంఘటిత చర్యలకు పాల్పడితే వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ హెచ్చరించారు. (చదవండి: భార్య నగ్న వీడియోల కేసులో మరో ట్విస్ట్‌)

మరిన్ని వార్తలు