Ghatkesar Bike Accident: రోడ్డు ప్రమాదంలో ముగ్గురి మృతి

24 Jun, 2022 08:30 IST|Sakshi

ఘట్‌కేసర్‌: బైక్‌పై ప్రయాణిస్తున్న ముగ్గురిని గుర్తు తెలియ ని వాహనం ఢీకొనడంతో ముగ్గురూ అక్కడికక్కడే మృతిచెందారు. ఈ సంఘటన  మేడ్చల్‌ జిల్లా ఘట్‌కేసర్‌ మండలం అవుషాపూర్‌ వద్ద గురువారం ఉదయం జరిగింది. సీఐ చంద్రబాబు తెలిపిన మేరకు.. జనగామ జిల్లా దేవరుప్పల మండలం సింగరాజుపల్లికి చెందిన పాలడుగు నవీన్‌ (25) ఊబర్‌లో బైక్‌ నడుపుతుండగా, జనగామ జిల్లా లింగాల ఘన్‌పూర్‌ మండలం కొత్తపల్లికి చెందిన దాసరి నవీన్‌ (23), జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలం మెట్లచిత్తాపూర్‌ గ్రామానికి చెందిన నానాడం వినిత (21) పంజగుట్టలో ప్రైవేటు ఉద్యోగాలు చేస్తున్నారు. ఇద్దరు స్నేహితు లు ఒకే గదిలో ఉంటుండగా వినీత ఆబిడ్స్‌లోని ఓ వసతి గృహంలో ఉంటోంది.

ఈ క్రమంలో ముగ్గురు స్నేహితులయ్యారు. బుధవారం కరీంనగర్‌ నుంచి కోచింగ్‌ కోసం సోదరుడు విశాల్, సోదరి విశాలి రాగ వారిని దిల్‌సుఖ్‌నగర్‌ వదిలిపెట్టి తిరిగి వసతి గృహానికి చేరుకుంది. గురువారం ఉదయం నవీన్, దాసరి నవీన్, వినిత బైక్‌పై బీబీనగర్‌ వైపు నుంచి ఉప్పల్‌ వైపు వెళుతూ అవుషాపూర్‌ వద్ద పెట్రోల్‌ పోయించుకొని సర్వీస్‌ రోడ్డు నుంచి మెయిన్‌ రోడ్డు ఎక్కుతున్నారు. ఈ క్రమంలో వీరు ప్రయాణిస్తున్న బైక్‌ను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది.

దీంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. 100 డయాల్‌ కాల్‌తో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. కాగా ప్రమాదానికి కారణమైన వాహనం, ముగ్గురు కలిసి ఎక్కడికి వెళ్లారన్న విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామన్నారు.   

(చదవండి: నలుగురిని కిడ్నాప్‌ చేసిన బంగారం స్మగ్లింగ్‌ గ్యాంగ్‌)

మరిన్ని వార్తలు