కత్తులు పట్టుకొని బాలీవుడ్‌ డైలాగులు.. వాట్సాప్‌ స్టేటస్‌

6 Sep, 2021 07:25 IST|Sakshi
పోలీసులు అరెస్టు చేసిన ముగ్గురు నిందితులు, కత్తులు పట్టుకుని ఉన్న స్టేటస్‌తో ఖలీల్‌ 

‘వాట్సాప్‌’ను పట్టుకుంటే వెపన్స్‌ దొరికాయి

ఆయుధాలతో దిగిన ఫొటోను పెట్టిన ఖలీల్‌

పక్కా సమాచారంతో పట్టుకున్న టాస్క్‌ఫోర్స్‌

విచారణలో వెలుగుచూసిన బెదిరింపుల దందా

95 కత్తులు స్వాదీనం.. ముగ్గురు నిందితుల అరెస్టు

సాక్షి, హైదరాబాద్‌: ‘బాప్‌ బాప్‌ హీ హోతా బేటా.. నామ్‌తో సునాహీ హోగా న.. సోనూ మోడల్‌ బోల్తే’ అంటూ బాలీవుడ్‌ డైలాగ్‌ను కత్తులు పట్టుకున్న ఫొటోపై రాసిన సయ్యద్‌ ఖలీల్‌ అనే యువకుడు తన వాట్సాప్‌కు స్టేటస్‌గా పెట్టాడు. ఇలాంటి వాటిని చూపించి స్థానికంగా బెదిరింపుల దందాకు దిగాడు. దీనిపై సమాచారం అందుకున్న మధ్య మండల టా'స్క్‌ఫోర్స్‌ పోలీసులు అతడిని పట్టుకోగా.. భారీ కత్తుల గోదాం వ్యవహారం బయటపడింది. ఈ విషయాన్ని ఆదివారం ఓఎస్డీ పి.రాధాకిషన్‌రావు వెల్లడించారు.  

బషీర్‌బాగ్‌లోని బ్యాంక్‌ కాలనీకి చెందిన సయ్యద్‌ ఖలీల్‌ ప్లంబర్‌.  ఇతను కొన్నాళ్లుగా వివిధ రకాల కత్తులతో దిగిన ఫొటోలను తన వాట్సాప్‌ స్టేటస్‌గా పెట్టేవాడు. వీటిని చూపించి స్థానికంగా బెదిరింపులకు పాల్పడేవాడు.  దీనిపై మధ్య మండల టాస్క్‌ఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్‌ మహ్మద్‌ అబ్దుల్‌ జావేద్‌కు సమాచారం అందింది. అతడి కదలికలపై నిఘా ఉంచిన నేపథ్యంలో శనివారం రాత్రి కత్తులతో ద్విచక్ర వాహనంపై వెళ్తున్నాడని గుర్తించారు. జియాగూడకు చెందిన లాండ్రీ వర్కర్‌ అంకిత్‌ లాల్‌తో కలిసి ఉండగా పట్టుకున్నారు.
చదవండి: తెలంగాణలోని జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌

తనిఖీలు చేయగా.. వీరి వద్ద భారీ కత్తులు బయటపడ్డాయి. దీంతో ఇరువురినీ తమ కార్యాలయానికి తరలించిన టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు లోతుగా విచారణ చేశారు. వీటిని అంకిత్‌కు సిద్ది అంబర్‌బజార్‌కు చెందిన రతన్‌ రాజ్‌ కుమార్‌ రూ.1400కు విక్రయించినట్లు వెలుగులోకి వచ్చింది. వాటి ఫొటోలను తమ స్టేటస్‌లుగా పెడుతున్న ఖలీల్, అంకిత్‌లు రూ.2500 నుంచి రూ.3500కు విక్రయిస్తున్నారు. ప్రధానంగా పెళ్లి బారాత్‌లు, ఉత్సవాల సమయంలో విన్యాసాలు చేయడానికి యువత వీటిని ఖరీదు చేస్తున్నారు. ఆయుధ చట్టం ప్రకారం ఇలాంటి వాటిని అనుమతి లేకుండా కలిగి ఉండటం, విక్రయించడం నేరం. 

రతన్‌ రాజ్‌ సిద్ధి అంబర్‌బజార్‌లో మహావీర్‌ గిఫ్ట్‌ అండ్‌ నావెల్టీస్‌ సంస్థ నిర్వహిస్తున్నాడంటూ ఈ ద్వయం బయటపెట్టింది. దీంతో టాస్‌్కఫోర్స్‌ పోలీసులు ఆ సంస్థపై దాడి చేసి రతన్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. తన వ్యాపారంలో నష్టాలు రావడంతో ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించానని అతడు చెప్పాడు. పెళ్లిళ్లు, పండగల సీజన్‌ కావడంతో భారీ కత్తులకు డిమాండ్‌ ఉందనే ఉద్దేశంతో ఢిల్లీలో కొనుగోలు చేసి ట్రాన్స్‌పోర్ట్‌లో రప్పించానని బయటపెట్టాడు. తన గోదాములో దాచి విక్రయాలు చేస్తున్నానన్నాడు.
చదవండి: బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం!

దీంతో గోదాంపై దాడి చేసిన పోలీసులు భారీ స్థాయిలో పెద్ద, చిన్న కత్తులను స్వాదీనం చేసుకున్నారు. ముగ్గురు నిందితుల నుంచి మొత్తం 87 పెద్ద కత్తులు, ఎనిమిది చిన్న కత్తులు సీజ్‌ చేశారు. తదుపరి చర్యల నిమిత్తం ముగ్గురు నిందితులను కత్తులతో సహా సైఫాబాద్‌ పోలీసులకు అప్పగించారు. ఇలాంటి వ్యవహారాలు ఉపేక్షించబోమని, చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు.   

మరిన్ని వార్తలు