యూపీలో మరో దారుణం

13 Oct, 2020 12:59 IST|Sakshi
ప్రతీకాత్మకచిత్రం

అక్కాచెల్లెళ్లపై యాసిడ్‌ దాడి

లక్నో : ఉత్తర్‌ప్రదేశ్‌లో మరో దారుణం చోటుచేసుకుంది. నిద్రిస్తున్న ముగ్గురు అక్కాచెల్లెళ్లపై గుర్తుతెలియని వ్యక్తి యాసిడ్‌ దాడికి పాల్పడిన ఘటన గోండాలో వెలుగుచూసింది. ఈ ఘటనలో ముగ్గురు మైనర్‌ బాలికలైన అక్కాచెల్లెళ్లలో ఇద్దరికి  కాలిన గాయాలు కాగా, మరొక బాలికకు ముఖంపై గాయాలయ్యాయి. బాధితులను చికిత్స నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటివరకూ గోండా పోలీసులు ఎవరినీ అరెస్ట​ చేయలేదు. బాధితులను వరుసగా 8, 12, 17 సంవత్సరాల వయసు కలిగిన బాలికలుగా గుర్తించారు. దాడికి సంబంధించి పూర్తి వివరాలు ఇంకా వెల్లడికాలేదు.

కాగా, హత్రాస్‌లో దళిత యువతి హత్యాచార ఘటన కలకలం రేపిన నేపథ్యంలో ఈ దారుణ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. సెప్టెంబర్‌ 14న యువతి పంటపొలంలో పనిచేసుకుంటుండగా నలుగురు వ్యక్తులు సామూహిక లైంగిక దాడికి పాల్పడి తీవ్రంగా గాయపరిచిన ఘటనలో బాధితరాలు ఢిల్లీలోని సఫ‍్ధర్‌జంగ్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గత నెల 29న ప్రాణాలు విడిచిన సంగతి తెలిసిందే. మరోవైపు హత్రాస్‌ కేసు దర్యాప్తునకు సంబంధించి కేరళకు చెందిన పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా (పీఎఫ్‌ఐ)కు చెందిన నలుగురు కార్యకర్తలను ప్రశ్నించేందుకు ఈడీ సిద్ధమైంది. చదవండి : పెళ్లి చేసుకోకుంటే యాసిడ్‌ పోసి చంపేస్తా..

మరిన్ని వార్తలు