అప్పు తీర్చాలన్నందుకు.. ముగ్గురు కలిసి ఒంటరి మహిళను..

11 Jul, 2021 07:56 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

ముగ్గురు నిందితుల అరెస్ట్‌

అల్వాల్‌: తీసుకున్న అప్పు తీర్చాలన్నందుకు ముగ్గురు కలిసి ఒంటరి మహిళను హత్య చేశారు. అంతేకాక నిందితులు ఆ హత్యను మరొకరిపై వెళ్లేలా పథకం చేశారు. అల్వాల్‌పోలీసులు తెలిపిన మేరకు..వెంకటాపురం లోతుకుంటలో నివసించే పూలమ్మ(40) దినసరి కూలిగా పనిచేసేది. భర్తతో విడిపోయి ఒంటరిగా ఉంటోంది. గతనెల 25వ తేదీన ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో హత్యకు గురైంది. కేసు నమోదు చేసుకున్న అల్వాల్‌ పోలీసులు విచారణ చేపట్టారు. బాధితురాలితో సన్నిహితంగా ఉండే అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారించారు. ఎలాంటి ఆధారాలు లభించలేదు. స్థానికంగా ఉండే సీసీ కెమెరాలు, ఇతరులు తెలిపిన వివరాల ప్రకారం నిఘా పెట్టి నిందితులను అరెస్టు చేశారు.

మృతురాలు పూలమ్మ వద్ద  సాయిలు(50) మంజుల (40) వినోద(49)లు అప్పుతీసుకున్నారు.అప్పు తిరిగి ఇవ్వమంటు పూలమ్మ ఒత్తిడి పెంచడంతో ఆమెను హత్య చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ హత్య మరొకరిపై మోపేలా ప్రణాళిక చేసుకున్నారు. గత 25న రాత్రి పూలమ్మతో సన్నిహితంగా ఉండే వ్యక్తి వచ్చి వెళ్ళిన అనంతరం గుడిసె వెనుక బాగం నుండి పొడగాటి పదునైన గడ్డపారతో మంచంపై నిద్రిస్తున్న పూలమ్మ తలపై పొడవడంతో నిద్రలోనే పూలమ్మ మృతి చెందింది. హత్య చేసిన అనంతరం నిందితుడు సాయిలు ఊరికి వెళ్లాడు. ఉదయం పూలమ్మ మృతి చెందిన సమాచారం తెలియడంతో పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి వివరాలు సేకరించారు.

గుడిసె లోపల గడియ పెట్టి ఉండడం, మృతురాలు మంచం పై పడి ఉండడం, హత్య స్థలంలోఎలాంటి అనుమానస్థితి లేకపోవడం పోలీసులకు హత్య కేసు చేదించడం సవాల్‌లుగా మారింది. చివరకు పూలమ్మ ఇంటి పక్కన ఉండే సాయిలు, వినోద, మంజులలు హత్య చేశారని తేలడంతో స్థానికులు ఆశ్చర్యానికి గురయ్యారు. తీసుకున్న అప్పు తిరిగి ఇవ్వమన్నందుకే హత్య చేసినట్లు పోలీసులకు తెలిపారు. నిందితులను అరెస్టు చేసి శనివారం రిమాండ్‌కు తరలించారు. కేసు విచారణలో అల్వాల్‌ పోలీసుల పనితీరును ఉన్నత అధికారులు అభినందించారు.

మరిన్ని వార్తలు