జాతరకు వెళ్లి వస్తూ అనంతలోకాలకు.. 

20 Feb, 2023 05:04 IST|Sakshi

రక్షణ గోడను ఢీకొన్న బైక్‌.. లోయలో పడి ముగ్గురు యువకుల మృతి 

అనంతగిరి మండలంలో ఘటన 

అనంతగిరి (అల్లూరి సీతారామరాజు జిల్లా): మహాశివరాత్రి జాతరకు వెళ్లి వస్తూ ముగ్గురు యువకులు లోయలోపడి మృతిచెందారు. ఈ ఘటన అనంతగిరి మండలంలోని డముకు–నిమ్మలపాడు రోడ్డు­లో­ని రాయిపాడు సమీపాన ఆదివారం ఉదయం జరిగింది. హుకుంపేట మండలం బూర్జ పంచా­య­తీ దిగసల్తాంగి గ్రామానికి చెందిన రాపా బుట్టన్న (35), సీదరి రాంబాబు(21), బొండం గణేష్‌(18) కలిసి ద్విచక్రవాహనంపై బొర్రాలో మహాశివరాత్రి జాతరకు శనివారం బయలుదేరి వెళ్లారు.

అక్కడ నుంచి లంగుపర్తి గ్రామంలోని జాతరకు కూడా వెళ్లారు. రెండు ప్రాంతాల్లోనూ సరదాగా గడిపిన వారు ఆదివారం ఉదయం ఐదు గంట­లకు స్వగ్రా­మా­నికి బయలుదేరారు. మార్గమధ్యంలో రాయి­పాడు సమీపంలోని మలుపు వద్దకు వచ్చేసరికి బైక్‌ అదుపుతప్పి రక్షణగోడను ఢీకొట్టడంతో ముగ్గురు యువకులు ఎగిరి లోయలో పడిపోయారు.

దీంతో తీవ్రంగా గాయపడిన బుట్టన్న, రాంబాబు, గణేష్‌ ఘటనాస్థలంలోనే మృతిచెందారు. స్థానికుల సమాచారం మేరకు ఎస్‌ఐ కరక రాము ఘటనాస్థలాన్ని పరిశీలించి, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం అరకు ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతిచెందిన బుట్టన్నకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.   

మరిన్ని వార్తలు