ముగ్గురిని బలితీసుకున్న కారు

11 May, 2021 04:29 IST|Sakshi
మృతిచెందిన షేక్‌ హుస్సేన్, నూర్జహాన్, చిన్న మస్తాన్‌

రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తలు, కుమారుడు దుర్మరణం

ఫిరంగిపురం (తాడికొండ): కారు ఢీకొని ద్విచక్రవాహనంపై వెళ్తున్న ముగ్గురు మృత్యువాత పడిన ఘటన గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం అమీనాబాద్‌ గ్రామ శివారులో ఆదివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 113 తాళ్లూరు గ్రామానికి చెందిన దంపతులు షేక్‌ చిన్న మస్తాన్‌ (55), షేక్‌ నూర్జహాన్‌ (45), వారి కుమారుడు షేక్‌ హుస్సేన్‌ (25)లు ఆదివారం రాత్రి ద్విచక్ర వాహనంపై అమరావతికి వెళ్తున్నారు.

అమీనాబాద్‌ శివారు తులసీ సీడ్స్‌ సమీపంలో ఎదురుగా వేగంగా వస్తున్న కారు బైక్‌ను ఢీ కొనడంతో ముగ్గురూ కిందపడి, తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వారిని ఆటోలో గుంటూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ముగ్గురూ మృతి చెందారు. తండ్రి పొలం పనులు చేసుకుంటుండగా, తల్లి ఉపాధి హామీ పనులకు వెళుతోంది. కుమారుడు పేరేచర్ల సమీపంలోని జోసిల్‌ కంపెనీలో పనికి వెళ్తుంటాడు. ముగ్గురూ మృతిచెందడంతో ఇక ఆ ఇంట్లో ఎవరూ మిగలలేదు. ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్‌ పరారీలో ఉన్నాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు