లారీని ఢీకొన్న కారు.. ముగ్గురు విద్యార్థుల దుర్మరణం

27 Feb, 2023 03:28 IST|Sakshi
శ్రీవికాస్‌రెడ్డి(ఫైల్‌) , ప్రవీణ్‌కుమార్‌(ఫైల్‌) , కల్యాణ్‌ (ఫైల్‌)

మృతులలో ఇద్దరు మెడికోలు, ఒకరు ఇంజనీరింగ్‌ విద్యార్థి  

చిత్తూరు జిల్లాలో దుర్ఘటన... 

లారీ ఢీకొని అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో మరో ఇద్దరు విద్యార్థుల మృతి 

గుడుపల్లె(చిత్తూరు జిల్లా):  చిత్తూరు జిల్లా గుడుపల్లె మండలం చిన్నశెట్టిపల్లె వద్ద ఆదివారం వేకువజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వైద్య విద్యార్థులు, మరో ఇంజనీరింగ్‌ విద్యార్థి దుర్మరణం చెందారు. గుడుపల్లె ఎస్‌ఐ రామాంజనేయులు తెలిపిన వివరాల ప్రకారం... శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పెనుబర్తి గ్రామానికి చెందిన సి.శ్రీవికాస్‌రెడ్డి (21), అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు మండలం రెడ్డివారిపల్లెకు చెందిన ప్రవీణ్‌కుమార్‌ (24) కుప్పం పీఈఎస్‌ కళాశాలలో ఎంబీబీఎస్‌ చదువుతున్నారు.

వీరికి మదనపల్లెలోని మిట్స్‌ కళాశాలలో బి.టెక్‌ ద్వితీయ సంవత్సరం చదువుతున్న అన్నమయ్య జిల్లా రాజంపేటకు చెందిన కల్యాణ్‌(20) స్నేహితుడు. కల్యాణ్‌ పిన్ని కుమారుడు సాయికృష్ణ తేజ కూడా కుప్పం పీఈఎస్‌ కళాశాలలో ఎంబీబీఎస్‌ చదువుతున్నాడు. ఈ క్రమంలో శనివారం రాత్రి కల్యాణ్‌ పీఈఎస్‌ కళాశాలకు వచ్చి సాయికృష్ణ తేజను కలిశాడు. ఆ తర్వాత తన స్నేహితులైన సి.శ్రీవికాస్‌రెడ్డి, ప్రవీణ్‌కుమార్‌ రూముకు వెళ్లాడు. ముగ్గురు కలిసి ఆదివారం వేకువజామున మూడు గంటల సమయంలో తమ స్నేహితుని కారు తీసుకుని కుప్పానికి బయలుదేరారు.

మార్గమధ్యంలో గుడుపల్లె మండలం చిన్నశెట్టిపల్లె వద్ద ముందు వెళ్తున్న లారీని ఓవర్‌ టేక్‌ చేసే క్రమంలో ఎదురుగా వస్తున్న మరో లారీని ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో కారు పల్టీలు కొ­ట్టిం­ది. అదే సమయంలో మరో లారీ వచ్చి కా­రును ఢీకొట్టడంతో సి.శ్రీవికాస్‌రెడ్డి, ప్రవీణ్‌­కుమార్, కల్యాణ్‌ అక్కడికక్కడే మృతిచెందారు. గుడుపల్లె పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కుప్పం ఏరియా ఆస్పత్రిలో ఆదివారం పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను బంధువులకు అప్పగించారు. ముగ్గురు విద్యార్థుల మృతితో అస్పత్రి వద్ద బంధువుల రోదనలు మిన్నంటాయి.  

ప్రాక్టికల్‌ పరీక్షలకు వెళుతూ మరో ఇద్దరు మృతి...  
అయినవిల్లి: లారీ ఢీకొని ఇంటర్మీడియెట్‌ ప్రాక్టికల్‌ పరీక్షలకు వెళుతున్న ఇద్దరు విద్యార్థులు మృతిచెందారు. ఈ ఘటన డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో ఆదివారం జరిగింది. అంబాజీపేట మండలం ముక్కామల నందెపుపాలేనికి చెందిన నందెపు రాజేష్‌ (17), కొత్త­పేట మండలం అల్లపల్లిపాలెం కండ్రిగకు చెందిన అల్లపల్లి నాగేంద్ర (17), రాకుర్తివారిపాలేనికి చెందిన కోటిపల్లి మోహన వీరవెంకట సాయికృష్ణ (18) అమలాపురంలో శ్రీచైతన్య కళాశాలలో ఇంటర్మీడియెట్‌ ద్వితీయ సంవత్సరం చదువుతున్నారు.

ముగ్గురూ కళాశాలలో ప్రాక్టికల్‌ పరీక్షకు బైక్‌పై బయలుదేరారు. అయినవిల్లి మండలం నేదునూరు పెదపాలెం టి.సావరం వద్ద జమ్మిచెట్టు సమీపానికి వచ్చేసరికి వీరి బైక్‌ను ఎదురుగా వస్తున్న లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో నందెపు రాజేష్, అల్లపల్లి నాగేంద్ర అక్కడికక్కడే మృతిచెందారు. సాయికృష్ణ (18) స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. అమలాపురం రూరల్‌ సీఐ డి.ప్రశాంత్‌కుమార్, అయినవిల్లి ఎస్‌ఐ ఎస్‌.నాగేశ్వరరావు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.  

మరిన్ని వార్తలు