అలల్లో కరిగిన కలలు

3 Jan, 2022 08:56 IST|Sakshi
ప్రమాదానికి ముందు సెల్ఫీ దిగిన స్నేహితులు

సూల్‌పురా: నూతన సంవత్సర వేడుకల్లో సరదాగా గడిపేందుకు నగరానికి చెందిన 8 మంది మిత్రులు విశాఖపట్టణం వెళ్లారు. ఆర్‌కే బీచ్‌లో దిగి ఎంజాయ్‌ చేస్తుండగా ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. వీరిలో ఒకరి మృతదేహం సముద్ర తీరానికి కొట్టుకువచ్చింది. రసూల్‌పురాలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ దుర్ఘటన ఆదివారం చోటుచేసుకుంది. స్థానికులు, వైజాగ్‌ వెళ్లిన సిద్ధు అనే యువకుడు అందించిన వివరాల ప్రకారం.. రసూల్‌పురా 105 గల్లీకి చెందిన యువకులు శివకుమార్, అజీజ్, శివ, వినోద్, మధు, పవన్, సిద్ధు, కార్తీక్‌లు కలిసి డిసెంబరు 30న కాచిగూడ రైల్వే స్టేషన్‌ నుంచి విశాఖపట్టణం వెళ్లేందుకు బయలుదేరారు.

ఆ రోజు రైలు టికెట్లు దొరక్కపోవడంతో 31న ఉదయం వెళ్లారు. ఈ క్రమంలో ఆదివారం మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో వీరంతా ఆర్కే బీచ్‌ వద్దకు బయలుదేరారు. వీరిలో అయిదుగురు ఒడ్డున ఉండగా శివకుమార్, అజీజ్, శివ సముద్రంలోకి దిగారు. ఈ క్రమంలో అలల «ఉద్ధృతికి ముగ్గురూ సముద్రంలోకి కొట్టుకుపోయారు. శివ మృతదేహం లభించింది. అజీజ్, శివకుమార్‌లు గల్లంతయ్యారు. ఘటన సమాచారం అందగానే రసూల్‌పురా నుంచి యువకుల తల్లిదండ్రులు, స్నేహితులు విశాఖకు బయలుదేరారు. 

మరిన్ని వార్తలు