కూలీ పనికి వెళ్లి ఇంటికి నడుచుకుంటూ వెళ్తుండగా

21 Apr, 2021 14:08 IST|Sakshi

ముగ్గురు మహిళలు మృతి

రంగారెడ్డి జిల్లా నందిగామ శివారులో ఘటన   

సాక్షి, నందిగామ: రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ముగ్గురు మహిళా కూలీలను వెనుక నుంచి వచ్చిన కారు ఢీకొనడంతో వారు అక్కడికక్కడే మృతిచెందారు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా నందిగామ మండల కేంద్రం శివారులో మంగళవారం సాయంత్రం చోటుచేసుకుంది. శంషాబాద్‌ మండలం మదన్‌పల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని పాత తండాకు చెందిన వరాత్య సక్కు (28), వర్త్యా లల్లీ (29)తోపాటు అదే తండాకు చెందిన ఘోరీ, అదే మండలం హల్లీకల్‌ తండాకు చెందిన పాత్లవత్‌ అరుణ (40)లు నందిగామ శివారులోని ఓ వెంచర్‌లో కూలీలుగా పనిచేస్తున్నారు.

మంగళవారం సాయంత్రం సక్కు, లల్లీ, అరుణ కూలి పనులు ముగించుకొని తండాకు వెళ్లేందుకు బయలుదేరారు. నందిగామ శివారులోని మేకగూడ చౌరస్తా వద్ద ఉన్న అండర్‌పాస్‌ బ్రిడ్జి సమీపంలోకి వారు రాగానే వెనుక నుంచి అతివేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అరుణ, సక్కు, లల్లీ అక్కడికక్కడే దుర్మణం చెందారు. వారిని ఢీకొట్టిన కారు కొంతదూరం వెళ్లి ఆగిపోవడంతో కారులోని వ్యక్తులు పరారయ్యారు. ప్రమాద వార్త తెలియగానే ఇన్‌స్పెక్టర్‌ రామయ్య, ట్రాఫిక్‌ ఎస్సై రఘు ఘటనాస్థలికి చేరుకొని మృతదేహాలను షాద్‌నగర్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కారులో నల్ల దుస్తులు ధరించిన డ్రైవర్‌తోపాటు వెనుక సీట్లో ముగ్గురు కూర్చొని ఉన్నట్లు సీసీ కెమెరాలో రికార్డయిందని ఇన్‌స్పెక్టర్‌ రామయ్య తెలిపారు.  

పింఛన్‌ కోసం వెళ్లి ప్రాణాలు కాపాడుకున్న మహిళ..
రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన ముగ్గురు మహిళలతోపాటు మరో మహిళ ఘోరి కూడా రోజూలాగే వారితో కలసి ఇంటికి తిరిగి వెళ్లేది.  మంగళవారం పింఛన్‌ ఇస్తారని తెలిసి ముందు గానే తండాకు వెళ్లిపోయింది. దీంతో మిగిలిన ముగ్గురు 6 గంటలకు బయలుదేరి రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. విషయం తెలిసిన వెంటనే అక్కడికి వచ్చిన ఘోరి... సాయంత్రం వరకు తనతో కలసిమెలసి ఉన్న ముగ్గురు మృతిచెందడంతో గుండెలవిసేలా రోదించింది.  

( చదవండి: ఆదమరచి నిద్రిస్తున్న వారిని.. అతి కిరాతకంగా..

మరిన్ని వార్తలు