దారుణం: ‘మా అమ్మాయినే వేధిస్తావా?’ మెడకు బెల్ట్‌ బిగించి..

21 Sep, 2021 17:34 IST|Sakshi

నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి చిత్రహింసలు

వీడియో తీసి శునకానందం

కేసు నమోదు చేసిన పోలీసులు

నిందితులు పరార్‌.. మధ్యప్రదేశ్‌లో ఘటన

భోపాల్‌: బంధువుల అమ్మాయిని వేధించారని ఓ యువకుడిపై కొందరు దారుణంగా ప్రవర్తించారు. మెడకు బెల్ట్‌ బిగించి గొడ్డును లాక్కెళ్లినట్లు లాక్కెళ్లారు. లాక్కెళ్తూనే తీవ్రంగా దాడి చేశారు. ఈ సంఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. దానికి సంబంధించిన వీడియో భయోత్పాతం కలిగిస్తోంది. వివరాలు ఇలా ఉన్నాయి.. రేవా జిల్లాలో బల్దావ్‌ జాదవ్‌ (28) ఓ యువతిని వేధించాడని ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆ అమ్మాయి తరఫు వారు బల్దావ్‌ను ముగ్గురు వెంట పట్టుకుని వచ్చారు. నిర్మానుష్య ప్రాంతంలో అతడి మెడకు బెల్ట్‌ కట్టేశారు.
చదవండి: యువతకు గుడ్‌న్యూస్‌.. నిరుద్యోగ భృతి, 80 శాతం ఉద్యోగాలు మీకే..

ఒకరు బెల్ట్‌తో బల్దావ్‌ను పట్టుకుని నిల్చుని ఉండగా మరొకరు కర్రలతో దాడి చేస్తున్నాడు. ఇంకొకరు ఆ దృశ్యాలను వీడియో తీస్తున్నాడు. విచక్షణా రహితంగా జాదవ్‌పై దాడి చేశారు. తీవ్ర రక్తగాయాలైనా కూడా కొట్టారు. తర్వాత బెల్ట్‌ తీసి పెద్ద కర్రలతో దాడి చేశారు. ఇంకోసారి వెంటపడతావా? అని ప్రశ్నించగా ‘లేదు.. ఇంకోసారి’ రాను అంటూ ఆ యువకుడు రోదిస్తూనే చెబుతున్నాడు. అతడిని హెచ్చరించి పంపించివేశారు. దాదాపు మూడు నిమిషాల పాటు చిత్రహింసలు పెట్టారు. దానికి సంబంధించిన వీడియో బయటకు వచ్చింది. 
చదవండి: డ్రగ్స్‌ వార్‌.. మంత్రి కేటీఆర్‌ పరువు నష్టం దావా స్వీక​రణ

ఈ వీడియో చూసిన పోలీసులు దాడి చేసిన వారిపై కేసు నమోదు చేశారు. నిందితులు ముగ్గురు పరారయ్యారని అదనపు సూపరింటెండెంట్‌ పోలీస్‌ శివ్‌కుమార్‌ వర్మ తెలిపారు. ఆ వీడియో 8-10 రోజుల కిందటదని చెప్పారు. వారెవరైనా కనిపిస్తే తమకు సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

మరిన్ని వార్తలు