Tamil Nadu Crime: ప్రేమ వివాహం.. ఆపై కులం తక్కువని..

26 Aug, 2022 17:30 IST|Sakshi
ప్రతీకాత్మకచిత్రం

చెన్నై: ప్రేమించి వివాహం చేసుకున్న భార్య తక్కువ కులానికి చెందిన యువతిగా తెలియడంతో గెంటేసిన భర్తను మూడు నెలల తరువాత పోలీసులు  అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. తిరువళ్లూరు జిల్లా తన్నీర్‌కులం గ్రామానికి చెందిన మోహన్‌ కుమార్తె దివ్య(26) ఈకాడులోని పాత సామాన్లు విక్రయించే దుకాణంలో పని చేసింది. అదే దుకాణంలో తూత్తుకుడి జిల్లా తెన్‌తిరుపేరై గ్రామానికి చెందిన చిత్రవేలు కుమారుడు శివనైంద పెరుమాల్‌(29) పని చేసినట్టు తెలుస్తోంది.

ఈ సమయంలో ఇద్దరి మధ్య ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఈ నేపథ్యంలో 2021 ఫిబ్రవరి 24న దివ్యను తూత్తుకుడికి తీసుకెళ్లి తల్లిదండ్రుల సమక్షంలో వివాహం చేసుకున్నాడు. అయితే కొంతకాలానికి ఎస్టీ కులానికి చెందిన యువతిగా తెలియడంతో అత్తింటివారు వేధించడంతో పాటు ఇంటి నుంచి గెంటేశారు. విధి లేని పరిస్థితుల్లో అక్కడే తలదాచుకున్న యువతి, స్థానికుల సాయంతో అల్వార్‌ తిరునగరి పోలీసులు, శ్రీవైకుంఠం మహిళా పోలీసులను ఆశ్రయించింది. అప్పట్లో పోలీసులు ఇద్దరికీ కౌన్సిలింగ్‌ ఇచ్చారు. అయినా పరిస్థితుల్లో మార్పు రాక యువతికి అత్తారింటి వేధింపులు ఎక్కువైనట్లు తెలుస్తోంది.

చదవండి: (వివాహేతరం సంబంధం తెలిసి హెచ్చరించాడు.. పసరు కోసం వెళ్తే..)

ఈ నేపథ్యంలో భర్త సైతం యువతిని అక్కడే వదిలేసి చెన్నై పల్లావరంలోని అక్క ఇంటికి వెళ్లిపోయాడు. దీంతో యువతి తన బంధువుల సాయంతో గత మే నెలలో తూత్తుకుడి నుంచి తన సొంత గ్రామానికి చేరుకుని తిరువళ్లూరు తాలుకా పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనను ప్రేమించి వివాహం చేసుకోవడంతో పాటు కులం పేరుతో ధూషించి గెంటేసిన భర్తపై చర్యలు తీసుకోవాలని కోరింది. ఈ నేపథ్యంలో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఎస్‌ఐ శక్తివేల్‌ నేతృత్వంలో తూత్తుకుడి వెళ్లి మూడు నెలలుగా పరారీలో ఉన్న శివనంద పెరుమాల్‌ను అరెస్టు చేసి తిరువళ్లూరు కోర్టులో హాజరు పరిచి రిమాండ్‌కు తరలించారు.  

చదవండి: (Doctor Death Mystery: ‘అశ్లీల చిత్రాలతో బెదిరించి చంపేశాడు’)

మరిన్ని వార్తలు