దేశ రాజధానిలో మరోసారి గ్యాంగ్‌రేప్‌ ఆరోపణలు

21 Sep, 2020 09:11 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

న్యూఢిల్లీ: దేశ రాజధానిలో మరోసారి గ్యాంగ్‌రేప్‌ ఆరోపణలు కలకలం రేపాయి. కనాట్ ప్లేస్ మార్కెట్‌కు కేవలం 2 కి.మీ దూరంలో ఇండియా గేట్‌ సమీపంలో ఉన్న ఫైవ్‌స్టార్‌ హోటల్‌లో సామూహిక అత్యాచారం జరిగినట్లు ఆదివారం బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. న్యూఢిల్లీ డిప్యూటీ పోలీస్ కమిషనర్ ఐష్ సింఘాల్ తెలిపిన వివరాల ప్రకారం.. హైసెక్యూరిటీ జోన్‌ అయిన సెంట్రల్‌ ఢిల్లీలోని ఓ ఫైవ్‌స్టార్‌ హోటల్‌లో టికెట్‌ బుకింగ్‌ ఎగ్జిక్యూటివ్‌, టూరిస్ట్‌ గైడ్‌గా పనిచేస్తున్న ఓ మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు బాధిత మహిళ ఫిర్యాదు అందింది.  (ప్రయాణం చివరకు విషాదాంతం)

ఆరోపణలు ఎదుర్కొంటున్న​ వ్యక్తులు నేరం జరిగిన హోటల్‌లో గదిని బుక్‌చేసుకున్నారు. అదే హోటల్‌లో టికెట్‌ బుకింగ్‌ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్న మహిళకు డబ్బు అవసరం ఉన్నట్లు వారు గుర్తించారు. వెంటనే ఆమెకు తక్కువ వడ్డీకి రుణం మంజూరు చేస్తామని చెప్పి ఆమెను హోటల్‌ గదికి తీసుకెళ్లి అత్యాచారానికి ఒడిగట్టారు. బాధిత మహిళ ఫిర్యాదుతో ఓ మహిళ సహా ఆరుగురు వ్యక్తులపై ఐపీసీ సెక్షన్‌ 376డి, 323, 34ల కింద కేసు నమోదు చేశాం. ఘటనలో ప్రధాన నిందితుడైన మనోజ్‌ శర్మ అనే వ్యక్తిని అరెస్ట్‌ చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు చెప్పారు. 

మరిన్ని వార్తలు