బ్లూటూత్‌ పేలి వ్యక్తి మృతి: దేశంలో ఇది రెండో ఘటన

7 Aug, 2021 12:31 IST|Sakshi

జైపూర్‌: వైర్‌లెస్‌ బ్లూటూత్‌ హెడ్‌ఫోన్‌ ఒక్కసారిగా పేలి ఆ శబ్ధానికి ఓ బాలుడు గుండె ఆగిపోయింది. ఆ పేలుడుతో ​బాలుడు మృతి చెందిన సంఘటన కలకలం సృష్టించింది. గుండెపోటుతో బాలుడు మృతి చెందడం దేశంలోనే మొదటిగా వైద్యులు పేర్కొంటున్నారు. ఈ సంఘటన రాజస్థాన్‌లోని జైపూర్‌ జిల్లా చౌము మండలం ఉదయ్‌పుర గ్రామంలో చోటుచేసుకుంది.

గ్రామానికి చెందిన రాకేశ్‌ శుక్రవారం ఒకరితో బ్లూటూత్‌ హెడ్‌ఫోన్‌ వేసుకుని ఫోన్‌ మాట్లాడుతున్నాడు. ఈ సమయంలో అకస్మాత్తుగా బ్లూటూత్‌ పేలిపోయింది. క్షణకాలంలో జరిగిన ఘటనతో బాలుడి గుండె ఆగిపోయి ((కార్డియాక్‌ అరెస్ట్‌) అపస్మారక స్థితిలో పడిపోయాడు. వెంటనే కుటుంబసభ్యులు సిద్ధివినాయక ఆస్పత్రికి తరలించారు. బ్లూటూత్‌ పేలడంతో చెవులకు గాయాలయ్యాయి. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు డాక్టర్‌ ఎన్‌ఎన్‌ రుండ్లా తెలిపారు. 

‘గుండెపోటుతో బాలుడు మృతి చెందడం బహుశా దేశంలో ఇదే మొదటి కేసు అయ్యింటుంది’ అని వైద్యులు రుండ్లా వివరించారు. అయితే ఇలాంటి ఘటనే రెండు నెలల కిందట ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో జరిగింది. జూన్‌ నెలలో 38 ఏళ్ల ప్రభుత్వ ఉద్యోగి బ్లూటూత్‌ పేలి మృతి చెందాడు. బ్లూటూత్‌ పరికరం పేలుడుతో ఇప్పటివరకు ఇద్దరు మృతి చెందడం కలకలం రేపుతోంది. ఆ పేలిన బ్లూటూత్‌ పరికరం ఏ కంపెనీదో? ఎందుకు పేలుతుందో అనే వివరాలు తెలియడం లేదు. అకస్మాత్తుగా వీటి పేలుళ్లు జరుగుతుండడంతో ప్రజలు బ్లూటూత్‌ వినియోగించేందుకు భయపడుతున్నారు.

మరిన్ని వార్తలు