ఆస్తి కోసమే కుటుంబం హత్య 

13 Nov, 2020 08:49 IST|Sakshi

సాక్షి, చెన్నై: ఆస్తి కోసం ఆమె ఎంత ఘోరానికైనా వెరవలేదు. అత్తమామలతో పాటు భర్తను సైతం తుపాకీ కాల్పులతో నిర్ధాక్షిణ్యంగా పొట్టనపెట్టుకుంది. తనకు సహకరించిన బంధువులతో కలిసి నింపాదిగా చెన్నై నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది. బుధవారం రాత్రి జరిగిన ఈఘోరానికి సంబంధించి పోలీసుల కథనం మేరకు వివరాలు.. రాజస్థాన్‌ రాష్ట్రానికి చెందిన దలీల్‌చంద్‌ (74) చెన్నై షౌవుకార్‌పేటలో ఫైనాన్స్‌ కంపెనీ నిర్వహిస్తున్నాడు. చెన్నై ఎలిఫెంట్‌గేట్‌ సమీపంలోని అపార్టుమెంటులో భార్య పుష్పాబాయ్‌ (70), కుమారుడు సీతల్‌(40)లతో కలిసి నివసిస్తున్నాడు. కుమార్తె పింక్‌ (36)కు వివాహం కాగా భర్తతో కలిసి చెన్నైలోనే వేరే చోట కాపురం ఉంటోంది. బుధవారం రాత్రి కుమార్తె పింక్‌ తల్లిదండ్రులకు ఫోన్‌ చేయగా ఎంతసేపటీకి ఎవ్వరూ తీయలేదు. దీంతో కంగారుపడి నేరుగా తల్లిదండ్రుల ఇంటికి చేరుకోగా తలపై తుపాకీ పేల్చిన గాయాలతో రక్తపుమడుగులో ముగ్గురూ విగతజీవులై పడి ఉండడంతో కేకలు పెట్టింది. చదవండి: తమిళనాడులో ట్రిపుల్‌ మర్డర్స్‌ సంచలనం

సమాచారం అందుకున్న ఎలిఫెంట్‌గేట్‌ పోలీసులు జాగిలం, వేలిముద్రనిపుణులతో అక్కడికి చేరుకున్నారు. సీతల్‌కు వివాహమైనా భార్యతో ఏర్పడిన మనస్పర్థల వల్ల తల్లిదండ్రులతో ఉంటున్నాడు. మానసిక స్థితి సరిగాలేని సీతల్‌కు రాజస్థాన్‌లోని బంధువులెవ్వరూ పిల్లనివ్వకపోవడంతో మహారాష్ట్రకు చెందిన జయమాలతో పెళ్లి జరిపించారు. 14 ఏళ్లపాటు సజావుగా కాపురం చేసిన సీతల్‌ క్రమేణా వేధింపులకు దిగడంతో ఈ ఏడాది జనవరిలో జయమాల భర్తను వదిలిపెట్టి తన ఇద్దరు కుమార్తెలతో పుట్టింటికి వెళ్లిపోయింది. భర్త, పోలీసులు తనను వే«ధిస్తున్నట్లు ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు పూనే పోలీసులు కేసు విచారణ సాగిస్తున్నారు. కొన్ని రోజుల క్రితం పింక్‌ తన ఇద్దరు సోదరులతో కలిసి చెన్నైకి వచ్చి ఆస్తిలో వాటా కావాలని సీతల్‌ను బెదిరించి వెళ్లిపోయారు.

ఇందుకు సంబంధించి చెన్నై ఎలిఫెంట్‌గేట్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో జయమాల, ఆమె బాబాయ్, మామ, ఇద్దరు సోదరులను వెంటబెట్టుకుని బుధవారం సాయంత్రం సీతల్‌ ఇంటికి వెళ్లి మళ్లీ ఆస్తిని పంచివ్వాలని బెదిరించారు. భరణం కింద రూ.5 కోట్లు డిమాండ్‌ చేసినట్లు తెలిసింది.  ఈ సమయంలో వాగ్యుద్ధం చోటుచేసుకోవడంతో దలీల్‌చంద్, పుష్పాబాయ్, సీతల్‌లపై  కిరాయి గూండా లు కాల్పులు జరిపి హతమార్చినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. నిందితులను పట్టుకునేందుకు ఐదు ప్రత్యేక పోలీసు బృందాలు రంగంలోకి దిగాయి.  

మరిన్ని వార్తలు