భార్య, అత్తను చంపి.. ఆపై అరాచకం

12 Jan, 2021 15:53 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

అగర్తల: త్రిపురలో దారుణం చోటుచేసుకుంది. భార్య, అత్తను పాశవికంగా హతమార్చాడో వ్యక్తి. ఆపై.. పిల్లల ముందే వారి మృతదేహాలను ముక్కలుగా నరికాడు. సోమవారం జరిగిన ఈ అమానుష ఘటనకు సంబంధించిన  వివరాలు.. పశ్చిమ త్రిపురలోని హపానియాకు చెందిన నిందితుడికి, ధలాయి జిల్లావాసి అయిన మహిళతో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు సంతానం. గత నాలుగు నెలలుగా దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. దీంతో బాధితురాలు పిల్లలను తీసుకుని కొన్నిరోజుల క్రితం పుట్టింటికి వచ్చింది.  ఈ క్రమంలో సోమవారం అక్కడికి చేరుకున్న నిందితుడు.. భార్య, ఆమె తల్లిపై దాడి చేసి చంపేశాడు. (చదవండి: విషాదం: కల్తీమద్యం తాగి 11 మంది మృతి)

అనంతరం పిల్లల ముందే వారి శవాలను ముక్కలు ముక్కలు చేశాడు. ఆ తర్వాత తాను విషం తాగి ఆత్మహత్యకు యత్నించాడు. ఈ పరిణామాలతో బెంబేలెత్తి పోయిన పిల్లలు భయంతో కేకలు వేస్తూ ఏడ్వటం మొదలుపెట్టారు. దీంతో ఇరుగుపొరుగు ఇంట్లోకి వచ్చి చూడగా మృతదేహాలు రక్తపు మడుగులో పడి ఉండగా.. వేరే గదిలో నిందితుడు స్పృహ కోల్పోయి ఉండటం గమనించారు. పోలీసులకు సమాచారం అందించగా.. ఘటనాస్థలికి చేరుకుని అతడిని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం నిందితుడు కోలుకుంటున్నాడని, భార్యాభర్తల మధ్య విభేదాలే హత్యలకు కారణమని భావిస్తున్నట్లు తెలిపారు. పిల్లలను ధలాయి చైల్డ్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌కు అప్పగించినట్లు వెల్లడించారు.

మరిన్ని వార్తలు