బెడ్‌రూంలో సెల్‌ఫోన్‌ పెట్టి.. భార్య మరొకరితో చనువుగా ఉన్న వీడియో రికార్డు 

30 Sep, 2022 10:10 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, సంగారెడ్డి: భార్యపై అనుమానంతో భర్త బెడ్‌రూంలో సెల్‌ఫోన్‌ కెమెరా ఏర్పాటు చేశాడు. మరో వ్యక్తితో చనువుగా ఉన్న దృశ్యం వీడియోలో రికార్డు అయ్యింది. దీనిపై నిలదీసినందుకు అతడిని కిడ్నాప్‌ చేశారు. దీనికి సంబంధించి కిడ్నాప్, వివాహేతర సంబంధం కేసులో పోలీసులు ఏడుగురికిపై కేసు నమోదు చేసి అందులో నలుగురికి రిమాండ్‌కు తరలించిన సంఘటన సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. బుధవారం సాయంత్రం పటాన్‌చెరు పోలీస్‌ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో అమీన్‌పూర్‌ సీఐ శ్రీనివాసులురెడ్డితో కలసి డీఎస్పీ భీంరెడ్డి ఆవివరాలు వెల్లడించారు.


వివరాలు వెల్లడిస్తున్న డీస్పీ భీంరెడ్డి 

భద్రాదికొత్తగూడెం జిల్లా ఇల్లెందుకు చెందిన రాయని రాజు, భార్యతో కలసి బతుకుదెరువు కోసం ఏడేళ్ల క్రితం  బీరంగూడ న్యూ సాయి భగవాన్‌ కాలనీకి వచ్చాడు. ఓ ప్రైవేట్‌ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. రాజుకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. వారు ఆంధ్రప్రదేశ్‌లోని మంగళగిరిలో అమ్మమ్మ వద్ద ఉంటూ చదువుకుంటున్నారు. కాగా రాజు బావ శాఖామణి బీరంగూడ మంజీరానగర్‌ కాలనీలో ఓలియో చర్చి పాస్టర్‌. ఇతడి భార్య అమీన్‌పూర్‌ మున్సిపల్‌ కోఆప్షన్‌ మెంబర్‌. ఈ క్రమంలో రాజు భార్య పద్మజ ప్రవర్తనలో మార్పు గమనించి అనుమానంతో ఈనెల 5వ తేదీన రాజు తన బెడ్‌రూమ్‌లో సెల్‌ఫోన్‌లో వీడియో ఆన్‌ చేసి సెల్ఫ్‌లో పెట్టాడు.

అదే రోజు దేవ శిఖామణి ఇంటికి వచ్చి పద్మజతో చనువుగా ఉన్న వీడియో రికార్డు అయ్యింది. ఈ విషయంపై రాజు తన భార్యను నిలదీయగా మంగళగిరిలోని తల్లిగారి ఇంటికి వెళ్లింది. ఈ విషయంపై రాజు దేవ శఖామణి నిలదీశాడు. ఈ క్రమంలో 13వతేదీన రాజు ఇంట్లో ఒంటరిగా ఉన్నాడు. అదే సమయంలో దేవశిఖామణి అతడి స్నేహితులు కిరణ్‌ గౌడ్, కుంటోల్ల మల్లేశ్, సాయి, దినేశ్, పర్మప్ప అతడిని బలవంతంగా కారులో ఎక్కించుకొని ఇసుకబావి వద్ద ఖాళీ వెంచర్‌లోకి తీసుకెళ్లారు.

అక్కడి నుంచి రాంచంద్రాపురంలోని అస్లంఖాన్‌కు చెందిన శ్రీ సాయి ఫొటో స్టూడియోలో నిర్బంధించారు. కట్టెలతో కొట్టి  రాజు తీసిన వీడియోలు తొలగించారు. రాత్రంతా రాజును ఫొటో స్టూడియోలో ఉంచారు. 14వ తేదీన ఉదయం రాజు అక్కడి నుంచి తప్పించుకొని తన స్వగ్రామానికి వెళ్లాడు. 26వ తేదీన సాయంత్రం అమీన్‌పూర్‌ పోలీస్‌స్టేషన్‌లో జరిగిన విషయం చెప్పి ఫిర్యాదు చేశాడు.

ఈమేరకు ఎస్‌ఐ సుభాశ్‌ కేసు నమోదుచేసుకొని దర్యాప్తు చేపట్టారు. రాజును కిడ్నాప్‌ చేసిన దేవ శిఖామణి, బేగంపేట కిరణ్‌ గౌడ్, మల్లేశ్‌గౌడ్, అస్లంఖాన్‌ను అదుపులోకి తీసుకున్నారు. సాయి, దినేష్, పర్మప్ప పరారీలో ఉన్నారు. పోలీసులు కారు, నాలుగు సెల్‌ఫోన్‌లు స్వాధీనం చేసుకున్నారు.  నలుగురిని 120(బి), 386, 448, 363, 324, 442, 506 సెక్షన్‌ల కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. 

కోఆప్షన్‌ భర్త సస్పెన్షన్‌ 
పటాన్‌చెరు: వివాహేతర సంబంధం కేసులో పోలీసులు అరెస్ట్‌ చేసిన టీఆర్‌ఎస్‌ నేత, అమీన్‌పూర్‌ కోప్షన్‌ సభ్యురాలి భర్త దేవశిఖా మణిని టీఆర్‌ఎస్‌ నుంచి సస్పెండ్‌ చేస్తున్నట్లు ఆ పార్టీ మండల అధ్యక్షుడు చౌటకూరి బాల్‌రెడ్డి తెలిపారు. బుధవారం మధ్యాహ్నం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. టీడీఎస్‌ మణి ఓ పాస్టర్‌గా గుర్తింపు పొందాడని, దాంతోనే ఆయనకు టీఆర్‌ఎస్‌లో పనిచేసే అవకాశం కలిగిందన్నారు.

సభ్య సమాజానికి మచ్చ తెచ్చేలా వ్యవహరించారనే ఆరోపణలు రావడంతో పార్టీ నుంచి తక్షణం సస్పెండ్‌ చేస్తున్నట్లు తెలిపారు. ఆయన భార్యను కూడా పదవి నుంచి తొలగించాలని తాము కోరుకుంటున్నామన్నారు. పార్టీకి చెడుపేరు తెచ్చేవిధంగా ప్రవర్తిస్తే ప్రోత్సహించేది లేదన్నారు. సమావేశంలో అమీన్‌పూర్‌ కౌన్సిలర్లు బాశెట్టి కృష్ణ, బిజిలి రాజు, నాయకులు యూనుస్, వడ్ల కాలప్ప పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు