ఆటోను ఢీకొన్న లారీ

12 Nov, 2020 03:57 IST|Sakshi
ఘటనా స్థలంలో మృతదేహాలు

ముగ్గురు మృతి.. ఏడుగురికి తీవ్రగాయాలు

చిల్లకూరు: వేగంగా దూసుకువచ్చిన లారీ ఢీ కొట్టడంతో ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం నాంచారంపేట వద్ద బుధవారం జరిగింది. చిల్లకూరు మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన కొందరు గూడూరు వెళ్లారు. బుధవారం అక్కడ్నుంచి ఆటోలో స్వగ్రామాలకు ప్రయాణమయ్యారు.

నాంచారంపేట వద్దకు వచ్చేసరికి.. గూడూరు బైపాస్‌లోని సిలికా యార్డులో ఇసుక లోడ్‌ చేసుకునేందుకు వెళ్తున్న లారీ వీరి ఆటోను ఢీకొట్టింది. ఆటో పల్టీలు కొడుతూ రోడ్డు పక్కకు పడిపోయింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఏరూరు గ్రామానికి చెందిన మామిడాల బుజ్జమ్మ (55), కలవకొండకు చెందిన ముడి శిఖామణి(52) అక్కడికక్కడే మృతి చెందారు. బల్లవోలుకు చెందిన భారతి(38)ని ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ఆమె మరణించింది. ఈ ప్రమాదంలో మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండడంతో నెల్లూరుకు తరలించారు. మిగిలిన వారికి గూడూరు ఏరియా ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.  

మరిన్ని వార్తలు