ఫోర్జరీ కేసులో టీటీడీపీ ప్రధాన కార్యదర్శి జీవీజీ నాయుడు అరెస్ట్‌ 

2 Nov, 2022 09:14 IST|Sakshi
టీడీపీ అధినేత చంద్రబాబుతో టీటీడీపీ ప్రధాన కార్యదర్శి జీవీజీ నాయుడు 

సాక్షి, బంజారాహిల్స్‌(హైదరాబాద్): జూబ్లీహిల్స్‌లోని ఖరీదైన అపార్ట్‌మెంట్‌లో రెండు ఫ్లాట్లను ఫోర్జరీ పత్రాలతో కబ్జా చేసేందుకు యత్నించిన టీ–టీడీపీ జనరల్‌ సెక్రటరీ గాజుల విజయ జ్ఞానేశ్వర్‌నాయుడు అలియాస్‌ జీవీజీ నాయుడును జూబ్లీహిల్స్‌ పోలీసులు మంగళవారం అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు.

వివరాల్లోకి వెళ్తే... జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెం. 70లోని జర్నలిస్టు కాలనీ–ప్రశాసన్‌నగర్‌ సమీపంలో ముంబైకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త రోనక్‌ కొటేచాకు జ్యోతి సిగ్నేచర్‌ అపార్ట్‌మెంట్‌లో రెండు ఫ్లాట్లు ఉన్నాయి. రోనక్‌ కొటేచా ఎక్కువగా ముంబైలో ఉండటాన్ని గమనించిన జీవీజీ నాయుడు ఇళ్ల కబ్జాకు స్కెచ్‌ వేశాడు. 2013లో ఈ రెండు ఫ్లాట్లను తాను కొంటున్నట్లుగా ఫోర్జరీ పత్రాలు తయారు చేసి అగ్రిమెంట్‌ ఆఫ్‌ సేల్‌ జరిగినట్లుగా సృష్టించాడు. వీటితో పాటు కొన్ని ఫోర్జరీ సంతకాలతో కూడిన క్యాష్‌ రిసిప్ట్‌లను కూడా తయారు చేశారు.

2020లో సిటీ సివిల్‌ కోర్టులో స్పెషల్‌ పర్‌ఫార్మాన్స్‌ ఫర్‌ రిజిస్ట్రేషన్‌ పిటిషన్‌ను దాఖలు చేస్తూ తాను మొత్తం డబ్బులు చెల్లించినా రోనక్‌ కొటేచా ఫ్లాట్‌ రిజిస్ట్రేషన్‌ చేయడం లేదంటూ తెలిపాడు. ఈ విషయం తెలుసుకున్న రోనక్‌ కొటేచా జూలైలో హైదరాబాద్‌కు వచ్చి ఫోర్జరీ పత్రాలతో తన ఫ్లాట్‌ను కబ్జా చేసేందుకు యత్నిస్తున్న జీవీజీ నాయుడుపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కోర్టులో జీవీజీ నాయుడు సమర్పించిన పత్రాలను పోలీసులు ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపగా వాటిల్లో రోనక్‌ కొటేచా సంతకాలన్నీ ఫోర్జరీ అంటూ ఎఫ్‌ఎస్‌ఎల్‌ నివేదిక ఇచ్చింది. దీంతో పోలీసులు జీవీజీ నాయుడుతో పాటు బల్విందర్‌ సింగ్, మరికొంత మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు

తనను అరెస్ట్‌ చేయకుండా నాయుడు  ముందస్తు బెయిల్‌ తెచ్చుకోవాలని విఫలయత్నం చేయగా కోర్టు మూడు వారాల పాటు అరెస్ట్‌ చేయవద్దంటూ ఆదేశాలచ్చింది. కోర్టు గడువు గత నెల 20న ముగియడంతో అప్పటి నుంచి పోలీసులు నాయుడును అరెస్ట్‌ చేసేందుకు యత్నించారు. నిందితుడు పోలీసుల కళ్లుగప్పి తిరుగుతుండగా ఎట్టకేలకు మంగళవారం తెల్లవారుజామున తన ఇంట్లో ఉండగా పోలీసులు పక్కా సమాచారంతో అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు.

మరిన్ని వార్తలు