సీరియల్ నటి శ్రావణి కేసులో పురోగతి

10 Sep, 2020 14:56 IST|Sakshi

పలువురు యువతులతో దేవరాజ్‌ ప్రేమాయణం

సాక్షి, హైదరాబాద్‌ : టీవీ నటి కొండపల్లి శ్రావణి ఆత్మహత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న దేవరాజ్‌ రెడ్డి గురించి పోలీసుల విచారణలో  కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. దేవరాజ్‌ టిక్‌టాక్‌ను అడ్డుపెట్టుకొని ఎంతోమంది యువతులను తన వెంట తిప్పుకున్నట్లు పోలీసులు గుర్తించారు. పలువురు అమ్మాయిలతో ప్రేమాయణం నడిపినట్టుగా టిక్‌టాక్  వీడియోల ద్వారా పోలీసులు నిర్థారణకు వచ్చారు. ప్లేబాయ్‌ అవతారం ఎత్తిన దేవరాజ్‌ ఒకరికి తెలియకుండా మరొకరితో ప్రేమాయణం నడిపినట్టుగా తెలుస్తోంది. (శ్రావణి ఆత్మహత్య.. ‘నాకేం సంబంధం లేదు)

అదే మాదిరిగా నటి శ్రావణిని కూడా దేవరాజ్‌ ప్రేమ పేరుతో ఉచ్చులోకి దింపాడు. అయితే తనతో పాటు మరికొంతమంది యువతులతో ప్రేమాయణం నడిపినట్టు శ్రావణి గుర్తించింది. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. అదే సమయంలో శ్రావణికి సంబంధించిన వీడియో, ఫోటోలను ఆమెకు చూపించిన దేవరాజ్ బెదిరింపులకు పాల్పడ్డాడు. తన ఫోటోలు, వీడియోలు అతడి మొబైల్‌లో ఉండటంతో ఆమె కంగుతిన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే దేవరాజ్‌ శ్రావణిని బ్లాక్‌మెయిల్‌ చేసినట్లు ఆమె కుటుంబసభ్యులు కూడా ఆరోపించారు. ఈ ఏడాది జూన్‌లో దేవరాజ్‌పై ఎస్సార్‌ నగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో, అతడిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఆ తర్వాత మళ్లీ శ్రావణి, దేవరాజ్‌ ఫోన్‌లో మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. (నటి శ్రావణి ఆత్మహత్య కేసులో కొత్త కోణం )

ఈ కేసు విచారణపై ఎస్సార్‌ నగర్‌ సీఐ నరసింహారెడ్డి మాట్లాడుతూ ఆరోపణలు ఎదుర్కొంటున్న దేవరాజ్‌ సరెండర్‌ అయ్యాడని, శ్రావణి ఆత్మహత్యకు గల కారణాలపై విచారణ చేస్తున్నట్లు చెప్పారు. శ్రావణి స్నేహితుడు సాయిని కూడా విచారణ చేస్తామని తెలిపారు. ఈ కేసులో ఆడియోలు, టిక్‌టాక్ వీడియోలు , సీసీ ఫుటేజ్‌లు పరిశీలిస్తున్నామన్నారు. అలాగే ఆరోపణలు ఎదుర్కొంటున్న నిర్మాత అశోక్‌ రెడ్డిని కూడా విచారణ చేపడతామని తెలిపారు. (నీకు విశ్వాసం లేదు దేవ.. నాతో ఆడుకోకు)

మరిన్ని వార్తలు